Team India: టీమ్‌ఇండియా అశ్విన్‌కు దారి చూపాలి: ఇయాన్‌ ఛాపెల్

టీమ్‌ఇండియా సెలెక్టర్లు సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు తుది జట్టులో అవకాశమివ్వాలని.. అతడు ఇప్పటికే అన్ని పరిస్థితుల్లో సరైన బౌలర్‌ అని నిరూపించుకున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ పేర్కొన్నారు...

Published : 12 Sep 2021 15:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా సెలెక్టర్లు సీనియర్‌ ఆఫ్‌స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు తుది జట్టులో అవకాశమివ్వాలని.. అతడు ఇప్పటికే అన్ని పరిస్థితుల్లో సరైన బౌలర్‌ అని నిరూపించుకున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్‌ ఛాపెల్‌ పేర్కొన్నారు. ఓ క్రీడాఛానల్‌కు రాసిన కథనంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమ్‌ఇండియా అన్ని విభాగాల్లో మెరుగైందని, మిడిల్‌ ఆర్డర్‌లో అశ్విన్‌కు చోటిస్తే ఇంకా పటిష్ఠంగా మారుతుందని ఛాపెల్‌ అభిప్రాయపడ్డారు.

‘అశ్విన్‌ చేరికతో టీమ్‌ఇండియా అత్యుత్తమ జట్టుగా మారుతుంది. అతడు అన్ని పరిస్థితుల్లో మేటి బౌలర్‌గా రాణిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలోనూ అది నిరూపించుకున్నాడు. అతడిని తుది జట్టులోకి తీసుకోవాలి’ అని ఛాపెల్‌ పేర్కొన్నారు. ఆ విషయంలో సెలెక్టర్లు చొరవ చూపాలని, ప్రస్తుతం టీమ్‌ఇండియా రిజర్వ్‌ బెంచ్‌ కూడా పటిష్ఠంగా ఉందని అన్నారు. కోహ్లీసేన అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉందని, అందుకు నిదర్శనం ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీస్‌లు గెలవడమే కాకుండా ఇంగ్లాండ్‌లోనూ ఆధిపత్యం చలాయించిందని మాజీ సారథి గుర్తుచేశారు.

ఇక మిడిల్ ఆర్డర్‌లో భారత్‌.. జడేజా, అశ్విన్‌, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్‌ను కలిగి ఉంటే జట్టు పూర్తిస్థాయిలో బలంగా మారుతుందని ఛాపెల్‌ తెలిపారు. జట్టులో కుడి, ఎడమ కాంబినేషన్‌ కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఇటీవల జరిగిన ఓవల్‌ టెస్టులో భారత్‌ జడేజాను ఐదో స్థానంలో ఆడించిందని వివరించారు. ఐదో స్థానంలో జడేజా నిరూపించుకుంటే పేస్‌ బౌలర్‌ ఆల్‌రౌండర్‌ అవసరమని అన్నారు. అప్పుడు హార్దిక్‌ పాండ్య లేదా శార్దూల్‌ ఠాకూర్‌ ఉన్నారని పేర్కొన్నారు. ఇక లోయర్‌ ఆర్డర్‌లో ముగ్గురు పేస్‌బౌలర్లను వినియోగించుకుంటే జట్టు సమతూకంగా ఉంటుందని ఛాపెల్‌ అభిప్రాయపడ్డారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు