PV Sindhu: గోపిచంద్‌ అభినందించారు.. కానీ సైనా చేయలేదు: సింధు

ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు అభినందనల వెల్లువ పెల్లుబికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన తొలి గురువు, జాతీయ బ్యాడ్మిటన్‌ చీఫ్‌...

Updated : 02 Aug 2021 17:21 IST

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన తర్వాత..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి పతకం సాధించి చరిత్ర సృష్టించిన భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుపై అభినందనల వెల్లువ పెల్లుబికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన తొలి గురువు, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ నుంచి అభినందనలు వచ్చాయని చెప్పింది. సోమవారం మీడియాతో ముచ్చటించిన సందర్భంగా సింధు ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, తన సీనియర్‌ సైనా నెహ్వాల్‌ నుంచి ఎలాంటి సందేశం రాలేదని చెప్పింది.

ఆరో సీడ్‌ సింధు ఆదివారం చైనా క్రీడాకారిణి బింగ్జియావోతో కాంస్య పోరులో తలపడిన సందర్భంగా 21-13, 21-15 తేడాతో అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన రెండో భారత వ్యక్తిగా నిలవడమే కాకుండా ఈ ఘనత సాధించిన తొలి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ నుంచి మొదలుకొని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, క్రీడా ప్రముఖులతో పాటు ఎంతో మంది సింధూను అభినందిస్తున్నారు. దాంతో గోపీచంద్‌ నుంచి ఏమైనా అభినందనలు వచ్చాయా అని మీడియా ప్రశ్నించగా ఆమె ఇలా సమాధానం ఇచ్చింది. ‘గోపీ సర్‌ నన్ను అభినందిస్తూ మెసేజ్‌ చేశారు. అయితే, నేను సామాజిక మాధ్యమాలు ఇంకా చూడలేదు. నెమ్మదిగా ప్రతి ఒక్కరికీ సమాధానమిస్తున్నా’ అని సింధు వివరించింది. అనంతరం సైనా గురించి ప్రశ్నించగా.. ఆమె నుంచి ఎలాంటి సందేశం రాలేదని చెప్పింది. తామిద్దరం ఎక్కువగా మాట్లాడుకోమని వెల్లడించింది.

ఇదిలా ఉండగా, సింధు గతేడాది కరోనా సమయంలో లండన్‌కు వెళ్లి మూడు నెలలు ప్రత్యేక శిక్షణ తీసుకుంది. దాంతో అప్పుడు గోపీచంద్‌తో ఆమెకు పడట్లేదనే వార్తలు వినిపించాయి. అయితే, అప్పుడు తాను న్యూట్రిషియన్‌ ప్రోగ్రామ్‌ కోసం అక్కడికి వెళ్లినట్టు ఆ వార్తలను కొట్టిపారేసింది. కానీ, అక్కడి నుంచి తిరిగొచ్చాక సింధు.. గోపీచంద్‌ అకాడమీని వీడి గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో సాధన చేసింది. దాంతో వారిద్దరి మధ్య తేడాలొచ్చాయని మరోసారి అర్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని