Under - 19: అండర్‌-19 ప్రపంచకప్‌ ఫేవరేట్‌ టీమ్‌ఇండియానే.. ఆధిపత్యమూ మనదే

యువ క్రికెటర్లు తమలోని ప్రతిభను ప్రపంచానికి తెలియజేప్పే చక్కటి వేదిక..

Updated : 14 Jan 2022 10:44 IST

(Photo: Cricket World Cup Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ఒకప్పటి స్టార్లు వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్, హర్భజన్‌, మహమ్మద్‌ కైఫ్, ఇర్ఫాన్‌ పఠాన్‌‌.. మనం ఇప్పుడు చూస్తున్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మనీశ్‌ పాండే, పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ సహా ఎందరో ఆటగాళ్లు జాతీయస్థాయిలో గుర్తింపు పొందారంటే దానికి వేదిక.. ‘అండర్‌-19 ప్రపంచకప్‌’.. ఇందులో అత్యుత్తమ ప్రతిభ చూపితే చాలు సీనియర్‌ జట్టుకు దారులు తెరుచుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. యువ క్రికెటర్లుగా దేశవాళీలో ఎంత రాణించినా.. మెగా ఈవెంట్లలో సత్తా చాటితే భవిష్యత్తుకు ఢోకా ఉండదు. అలాంటి అండర్ -19 వరల్డ్‌ కప్‌లు ఎన్ని జరిగాయి.. అందులో టీమ్‌ఇండియా ఎన్నిసార్లు గెలుచుకుందో ఓసారి తెలుసుకుందాం..  

యువ క్రికెటర్లు తమలోని ప్రతిభను ప్రపంచానికి తెలియజేప్పే చక్కటి వేదిక అండర్‌-19 మెగా టోర్నీ. నేటి నుంచి అండర్‌ -19 వరల్డ్‌ కప్‌ ప్రారంభమవుతుంది. అండర్‌-19లో ప్రపంచ కప్‌ పోటీలు మొదలై ఇప్పటికి మూడు దశాబ్దాలు దాటింది. పదమూడు టోర్నీలు జరిగాయి. ఇప్పుడు 14వ టోర్నీకి వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇస్తోంది. నేటి వరకు టీమ్‌ఇండియా అత్యధికంగా ఏడుసార్లు ఫైనల్‌కు చేరుకోగా.. నాలుగు కప్‌లను సాధించింది. ఆ తర్వాత ఆసీస్‌ (3), పాకిస్థాన్‌ (2).. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ ఒక్కోసారి గెలుచుకున్నాయి. గత ఛాంపియన్‌గా బంగ్లా బరిలోకి దిగుతుండగా.. ఫేవరెట్‌గా మాత్రం భారత్‌ టైటిల్‌ కోసం పోటీపడనుంది.

తొలిసారి కప్‌ సాధించిన వేళ..

అప్పటికి కేవలం రెండు సార్లు మాత్రమే అండర్ -19 ప్రపంచకప్‌ పోటీలు జరిగాయి. మొదటిసారి ఆరో స్థానం, రెండో వరల్డ్‌కప్‌లో రెండో రౌండ్‌లోనే భారత్‌ ఇంటిముఖం పట్టింది. మూడోసారి (2000) మాత్రం అతిథ్యమిచ్చిన శ్రీలంకను ఫైనల్‌లో మట్టికరిపించి కప్‌ను సొంతం చేసుకొంది. ఈ జట్టుకు మహమ్మద్ కైఫ్ సారథిగా వ్యవహరించాడు. కైఫ్‌తో సహా యువరాజ్‌ సింగ్‌, వేణుగోపాల్‌రావు జాతీయ జట్టుకు ఎంపిక కావడం విశేషం. అయితే కైఫ్‌, యువీ మాత్రమే విజయవంతంగా కెరీర్‌లో రాణించగా.. తెలుగు క్రికెటర్‌ వేణుగోపాల్‌ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో భారీస్థాయిలో అవకాశాలను అందుకోలేకపోయాడు.

మళ్లీ విరాట్ సారథ్యంలో..

మొదటి కప్‌ను అందుకున్న తర్వాత రెండో టైటిల్‌ను గెలుచుకునేందుకు భారత్‌కు ఎనిమిదేళ్లు పట్టింది. ఆ మధ్యలో మూడుసార్లు జరిగితే రెండు మార్లు సెమీస్‌లో ఓటమి చవిచూడగా..  ఒకసారి రన్నరప్‌గా నిలిచింది. అయితే, 2008లో అండర్‌ -19 ప్రపంచకప్‌ను సారథిగా విరాట్ కోహ్లీ సాధించి పెట్టిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఆ జట్టుకు విరాట్ నాయకుడు కాగా.. రవీంద్ర జడేజా వైస్‌ కెప్టెన్‌ కావడం విశేషం. వీరిద్దరే కాకుండా మనీశ్‌ పాండే, సౌరభ్ తివారీ, అభినవ్ ముకుంద్, సిద్ధార్థ్‌ కౌల్ వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. జాతీయ జట్టు, ఐపీఎల్‌ ఫ్రాంచైజీ తరఫున మంచి ప్రదర్శనే ఇచ్చారు. ఇదే సిరీస్‌లో విదేశీ ఆటగాళ్లు కేన్‌ విలియమ్సన్‌, ట్రెంట్ బౌల్ట్‌, స్టీవ్‌ స్మిత్, మార్కస్‌ స్టొయినిస్‌, టిమ్‌ సౌథీ, తిసారా పెరీరా అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచారు.

వెలుగులోకి మరో తెలుగు కుర్రాడు

2012లో టీమ్‌ఇండియా మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. మూడో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్‌లో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికైన సారథి ఉన్ముక్త్‌ చంద్ జాతీయ జట్టుకు మాత్రం ఎంపిక కాలేకపోయాడు. ఐపీఎల్‌లోనూ తక్కువ మ్యాచ్‌లే ఆడాడు. దీంతో గతేడాది భారత్‌లో క్రికెట్‌ ఆడటం లేదని, ఇక్కడి క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు కఠిన నిర్ణయం ప్రకటించాడు. ఇదే జట్టులోని తెలుగు కుర్రాడు హనుమ విహారి జాతీయ టెస్టు జట్టులో అడపాదడపా స్థానం సంపాదించగలుగుతున్నాడు. కానీ.. మిగతా ఫార్మాట్లలో అవకాశాలను అందుకోలేకపోతున్నాడు.  

మళ్లీ ఆరేళ్లకు కప్‌.. 

మరో ఆరేళ్లకు భారత్‌ జట్టు అండర్‌-19 ప్రపంచ కప్‌ను చేజిక్కించుకుంది. మధ్యలో 2014లో ఐదో స్థానంలో నిలిచింది. 2016లో టైటిల్‌ సాధించే అవకాశం వచ్చినా మిస్‌ చేసుకుంది. కప్‌ సాధించకపోయినా.. ఇషాన్‌ కిషన్‌, రిషభ్‌ పంత్‌, ఖలీల్‌ అహ్మద్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి ఆటగాళ్లు సీనియర్‌ జట్టుకు ఎంపికయ్యారు. అయితే, 2018లో పృథ్వీషా నాయకత్వంలోని టీమ్‌ఇండియా యువ జట్టు టైటిల్‌ను తీసుకొచ్చింది. ఈ టీమ్‌ నుంచి పృథ్వీతోపాటు శుభ్‌మన్‌ గిల్, శివమ్‌ మావి, రియాన్‌ పరాగ్, అనుకుల్‌ రాయ్‌, అభిషేక్‌ శర్మ, హర్షదీప్‌ సింగ్ వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. గిల్‌, పృథ్వీ షా సీనియర్‌ జట్టుకు ఎంపికవ్వగా.. మిగతా వారు ఐపీఎల్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. 

పోయినసారి మిస్‌.. మరి ఈసారైనా

2020లో ప్రియమ్‌ గార్గ్‌, రవి బిష్ణోయ్, కార్తిక్ త్యాగి, యశస్వి జైస్వాల్ వంటి కుర్రాళ్ల జట్టు ఫైనల్‌కు చేరింది. అయితే ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌ విజయం సాధించింది. కాస్తలో కప్‌ను చేజార్చుకుంది. మరి ఈసారి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న టీమ్‌ఇండియా టైటిల్‌ను సాధించుకురావాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నాడు. భారత్‌ జట్టుకు కలిసొచ్చే అంశం ఏంటంటే.. ఇటీవల జరిగిన ఆసియా కప్‌ను కైవసం చేసుకోవడం. అదే ఊపును విండీస్‌ వేదికగా జరిగే అండర్-19 ప్రపంచకప్‌లోనూ ప్రదర్శించి విజయం సాధించాలి. గ్రూప్‌ స్థాయిలో దక్షిణాఫ్రికా (జనవరి 15), ఐర్లాండ్‌ (జనవరి 19), ఉగాండా (జనవరి 22) జట్లతో పోటీ పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని