Virat Kohli: నా కూతురి ఫొటోలు తీయొద్దు.. ఫొటోగ్రాఫర్లకు కోహ్లీ రిక్వెస్ట్‌

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ గురువారం జట్టు సభ్యులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. ఈ సందర్భంగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది...

Published : 17 Dec 2021 08:35 IST

(Photo: Virat Kohli Instagram)

ముంబయి‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ గురువారం జట్టు సభ్యులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాడు. ఈ సందర్భంగా ముంబయి ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తన కూతురు వామికా ఫొటోలను తీయొద్దని అతడు ఫొటోగ్రాఫర్లను కోరాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. కోహ్లీ-అనుష్క దంపతులు ఈ ఏడాది జనవరిలో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకు వామికా అని నామకరణం చేశారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పాపకు సంబంధించిన ఒక్క ఫొటోను కూడా ఈ స్టార్‌ దంపతులు బయట పెట్టలేదు.

అప్పుడప్పుడూ తమ సామాజిక మాధ్యమాల్లో వామికా ఫొటోలు పంచుకున్నా అందులో ముఖం కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ పాపకు ఒక వయసు వచ్చేంతవరకు తన ఫొటోలను బయటి ప్రపంచానికి చూపించకూడదని కోహ్లీ దంపతులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వాళ్లే స్వయంగా ఒక సందర్భంలో చెప్పారు. ఇక టీమ్‌ఇండియా ఆటగాళ్లు గురువారం తమ కుటుంబసభ్యులతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తుండగా విమానాశ్రయం వద్ద ఎదురుచూస్తున్న ఫొటోగ్రాఫర్లను చూసిన కోహ్లీ.. తన గారాల పట్టి ఫొటోలు తీయొద్దని కోరాడు. కాగా, కరోనా కారణంగా ఆటగాళ్లు విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో కచ్చితమైన బయోబబుల్‌ వాతావరణంలో గడపాల్సి రావడంతో ఆటగాళ్లు ఈ మధ్య తమ వెంట కుటుంబసభ్యులను కూడా తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ సైతం ఈమధ్య ఎక్కడికెళ్లినా తన భార్య, కుమార్తెతో కలిసి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వామికా ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు ఆసక్తి చూపిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని