Team India: టీమ్‌ఇండియా బలం ఇప్పుడు పేసర్లే.. మూడేళ్లుగారాణిస్తోన్నకోహ్లీసేన పేస్ దళం

కొంతకాలంగా టీమ్ఇండియా టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ క్రికెట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ సంచలన విజయాలు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే...

Updated : 03 Jan 2022 11:47 IST

జోహెన్నెస్‌బర్గ్‌పై కన్నేసిన భారత్‌..

గత మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తోన్న  భారత జట్టు ఎప్పుడూ అక్కడ సూపర్‌స్పోర్ట్‌ మైదానంలో విజయం సాధించిన సందర్భం లేదు. కానీ, కోహ్లీసేన ఇప్పుడు చరిత్ర తిరగరాసింది. తొలి టెస్టులో మొత్తం 18 వికెట్లు పడగొట్టిన భారత పేస్‌ దళం ఇప్పుడు రెండో మ్యాచ్‌పైనా కన్నేసింది. ఒకవేళ అక్కడా రాణిస్తే భారత్‌ సిరీస్‌ గెలవడం ఖాయం. దీంతో సఫారీ గడ్డపై తొలిసారి టీమ్‌ఇండియా చారిత్రక విజయం సాధించే సువర్ణావకాశం ఉంది.

ఇరు జట్ల ప్రస్తుత పరిస్థితి..

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌ తేలిగ్గానే ఈ సిరీస్‌ కైవసం చేసుకునేలా కనిపిస్తున్నా దక్షిణాఫ్రికాను తక్కువ అంచనావేసే పరిస్థితి లేదు. సొంతగడ్డపై ఆ జట్టు ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకునే వీలుంది. ఎంగిడి, రబాడ లాంటి ప్రపంచ శ్రేణి పేసర్లు ఆ జట్టులో ఉన్నారు. దీంతో వారి నుంచి భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌కు ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా భారత జట్టులో ఓపెనర్లే పరుగులు చేయడం, మిడిల్‌ ఆర్డర్‌ చేతులెత్తేయడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆటగాళ్లంతా కచ్చితంగా రాణించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ ప్రస్తుతం బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. అందులోనూ క్వింటన్‌ డికాక్‌ లాంటి వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ టెస్టులకు వీడ్కోలు పలకడంతో ఆ ఇబ్బంది మరింత పెరిగింది. దీంతో భారత బౌలర్లు చెలరేగితే దక్షిణాఫ్రికాకు కష్టాలు తప్పవనే చెప్పొచ్చు.

మేటి బౌలింగ్‌ యూనిట్‌గా భారత్‌..

ఇక రెండో టెస్టుకు ముందు భారత బౌలింగ్‌ బలం ఎలా ఉందని ఒకసారి పరిశీలిస్తే అద్భుతమైన ఫలితాలు కనపడుతున్నాయి. కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా విదేశాల్లో మొత్తం 36 టెస్టులు ఆడగా.. అందులో పేస్‌ బౌలర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అప్పటి నుంచి మొత్తం 3,338.2 ఓవర్లు బౌలింగ్‌ చేసిన పేసర్లు.. 392 వికెట్లు సాధించి.. 51.0 అద్భుతమైన స్ట్రైక్‌రేట్‌ నమోదు చేశారు. దీంతో ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్‌ బౌలింగ్‌ విభాగంలో ‘కోహ్లీసేన’ అగ్రస్థానంలో నిలిచింది. ఇక వివియన్‌ రిచర్డ్స్‌ నేతృత్వంలోని విండీస్‌ బౌలింగ్‌ యూనిట్‌ కోహ్లీసేన తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఆ జట్టు విదేశాల్లో 26 మ్యాచ్‌లు ఆడగా.. 3,427 ఓవర్లు బౌలింగ్‌ చేసిన పేస్‌ బౌలర్లు.. 398 వికెట్లు సాధించి.. 51.6 స్ట్రైక్‌రేట్‌ కలిగి ఉన్నారు. ఆపై స్టీవ్‌వా నేతృత్వంలోని ఆస్ట్రేలియా పేసర్లు.. 28 టెస్టుల్లో 2,591.2 ఓవర్లు బౌలింగ్‌ చేసి 286 వికెట్లు సాధించారు. దీంతో వారు 54.3 స్ట్రైక్‌రేట్‌ సాధించారు.

పది వికెట్లలోనూ మనోళ్లే టాప్‌..

మరోవైపు సెంచూరియన్‌ టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో పేస్ బౌలర్లే మొత్తం పది వికెట్లు తీశారు. దీంతో విదేశాల్లో అత్యధికంగా ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన పేస్‌ బౌలింగ్‌ జాబితాలోనూ భారత్‌(పది సార్లు) అగ్రస్థానంలో నిలిచింది. 2018 నుంచీ కోహ్లీసేన సారథ్యంలోని బుమ్రా, షమి, ఇషాంత్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇటీవల శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌ లాంటి యువకులు సైతం సీనియర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మెరుస్తున్నారు. ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ పేసర్లు 6 సార్లు ఈ ఘనత సాధించి రెండో స్థానంలో నిలవగా.. న్యూజిలాండ్‌ బౌలర్లు నాలుగు సార్లు పది వికెట్లు తీసి మూడో స్థానంలో నిలిచారు. దీంతో ఎలా చూసినా భారత పేస్ బౌలింగ్‌ యూనిట్‌ సంపూర్ణంగా ఉంది.  కచ్చితంగా రెండో టెస్టులోనూ టీమ్‌ఇండియా విజయం సాధించేలా కనిపిస్తోంది. మరో విశేషం ఏమిటంటే.. జోహెన్నెస్‌బర్గ్‌లో టీమ్‌ఇండియా ఇప్పటివరకూ ఒక్క టెస్టు కూడా ఓటమిపాలవ్వలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించగా.. మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. దీంతో టీమ్‌ఇండియా ఇక్కడే సిరీస్‌ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని