
INDvsENG: అశ్విన్ను కచ్చితంగా తుది జట్టులోకి తీసుకోవాలి: వీవీఎస్
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్తో జరిగే రెండో టెస్టుకు టీమ్ఇండియా రవిచంద్రన్ అశ్విన్ను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. అశ్విన్ స్వదేశంలో ఇంగ్లాండ్పై అద్భుత ప్రదర్శన చేసినా తాజా టెస్టులో పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. అతడికి బదులు శార్ధూల్ ఠాకూర్ను ఎంపిక చేశారు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ మిగతా టెస్టుల్లోనూ టీమ్ఇండియా ఇలాగే నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ విధానాన్నే పాటిస్తుందని చెప్పాడు. దాంతో రాబోయే టెస్టుల్లో అశ్విన్ను ఆడించాలని వీవీఎస్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
తాను కచ్చితంగా అశ్విన్ను తుదిజట్టులోకి తీసుకుంటానని, అతడి చేరికతో బౌలింగ్ డెప్త్ పెరగడమే కాక బౌలింగ్లో వైవిధ్యం కూడా ఉంటుందని అన్నాడు. పరిస్థితులు, వాతావరణం ఎలా ఉన్నా అశ్విన్ మేటి బౌలర్కు మించినవాడని ప్రశంసించాడు. అద్భుతమైన ప్రదర్శన చేయడానికి తగిన వాడని, మ్యాచ్ విన్నర్గా నిలిచి ఇంగ్లాండ్పై ఒత్తిడి తీసుకురాగల సమర్థుడని లక్ష్మణ్ కొనియాడాడు. ఇక తొలి టెస్టులో శార్ధూల్పై స్పందించిన వీవీఎస్.. కెప్టెన్ కోహ్లీ అతడికి మరిన్ని బాధ్యతలు అప్పగించి చూడాలనుకున్నాడని చెప్పాడు. శార్ధూల్ బ్యాట్తో రాణించకపోయినా బంతితో తనకొచ్చిన అవకాశాన్ని పలు కీలక వికెట్లు తీయడం ద్వారా సద్వినియోగం చేసుకున్నాడని తెలిపాడు. ఇద్దరూ సమర్థవంతులేనని, అయితే.. తనకు మాత్రం అశ్విన్ను తుదిజట్టులో చూడాలని ఉందని వీవీఎస్ స్పష్టంచేశాడు.