IND vs SA : మూడో టెస్టూ హుష్‌...సఫారీలదే సిరీస్‌

సఫారీల గడ్డపై టెస్టు సిరీస్‌ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న భారత జట్టుకి మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్‌ సాధించాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం...

Updated : 14 Jan 2022 19:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న భారత జట్టుకి మరోసారి నిరాశే ఎదురైంది. సిరీస్‌ సాధించి చిరకాల విజయం అందుకోవాలంటే తప్పక గెలవాల్సిన మూడో టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయం పాలైంది. ఆతిథ్య సఫారీ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా విజయంలో కీగన్‌ పీటర్సన్‌, కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌, లుంగి ఎంగిడి, కగిసో రబాడ కీలకంగా వ్యవహరించారు. 

ఓవర్‌నైట్‌ స్కోరు 101/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఎలాంటి తడబాటు లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరో వికెట్‌ మాత్రమే నష్టపోయి కావాల్సిన పరుగులను సునాయాసంగా (212) రాబట్టింది. కీగన్ పీటర్సన్‌ (82: 113 బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. డీన్‌ ఎల్గర్‌ (30) పరుగులు చేసి ఔటయ్యాడు. వాండర్ డస్సెన్ (41*), తెంబా బవుమా (32*) మిగతా పని పూర్తి చేశారు. ఏ దశలోనూ భారత్‌ జట్టు వైపు గెలుపు త్రాసు తూగలేదు. భారత బౌలర్లలో బుమ్రా, మహమ్మద్‌ షమి, శార్దూల్ ఠాకూర్‌ తలో వికెట్ పడగొట్టారు. 

తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 13 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమ్‌ఇండియా 198 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (100: 139 బంతుల్లో 6×4, 4×6) శతకంతో రాణించినా.. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (29) ఫర్వాలేదనిపించినా.. కేఎల్‌ రాహుల్ (10), మయాంక్‌ అగర్వాల్ (7), ఛెతేశ్వర్‌ పుజారా (9), అజింక్య రహానె (1) విఫలమయ్యారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ముందు 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 223 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (79: 201 బంతుల్లో 12×4, 1×6), ఛెతేశ్వర్ పుజారా (43: 77 బంతుల్లో 7×4) మినహా మిగతా బ్యాటలెవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ నాలుగు, మార్కో జాన్సన్‌ మూడు, లుంగి ఎంగిడి, కేశవ్‌ మహరాజ్‌, అలివీర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు 210 పరుగులకే ఆలౌట్ చేశారు. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. ఉమేశ్‌ యాదవ్‌, మహమ్మద్‌ షమి తలో రెండు, శార్దూల్ ఠాకూర్‌ ఒక వికెట్‌ తీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని