Pele: అంతర్యుద్ధాన్ని ఆపిన మ్యాచ్‌..!

పీలే ప్రభావం ప్రపంచంపై చాలా గాఢంగా ఉంది. అతడి ఆటను ప్రత్యక్షంగా చూడటం కోసం ఓ అంతర్యుద్ధం కొన్ని రోజులపాటు ఆపేశారంటే అర్థం చేసుకోవచ్చు. 

Published : 30 Dec 2022 18:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫుట్‌బాల్‌ కింగ్‌ పీలే ప్రభావం ప్రపంచంపై ఏ స్థాయిలో ఉండేదో చెప్పేందుకు 1969లో జరిగిన ఓ ఘటన ఉదాహరణగా నిలుస్తుంది. ఆ ఏడాది పీలే ఆడుతున్న శాంటోస్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ అంతర్జాతీయ పర్యటనలు నిర్వహించి పలు దేశాల్లో మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించింది. 1969 ఫిబ్రవరి4 శాంటోస్‌ క్లబ్‌ సభ్యులు పీలే నేతృత్వంలో నైజీరియాలో అడుగుపెట్టారు. అప్పటికే ఆ దేశం బైఫ్రా యుద్ధంలో తలమునకలైంది. ఈ యుద్ధంలో అతి స్వల్పకాలంలోనే దాదాపు 10లక్షల మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో శాంటోస్‌ జట్టు నైజిరియాలోని బెనిన్‌లో ఆడేందుకు అంగీకరించింది. కానీ, తమ భద్రతకు హామీ ఇవ్వాలని నైజిరియా ప్రభుత్వాన్ని కోరింది. దీంతో స్థానిక గవర్నర్‌ శామ్యూల్‌ ఒగ్బెముడియా మ్యాచ్‌ రోజు పబ్లిక్‌ హాలిడే ప్రకటించారు. దీంతోపాటు నైజిరియా, బైఫ్రా పక్షాలు కొన్ని గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించాయి.

ఇక ‘సూపర్‌ ఈగిల్‌’ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌ను శాంటోస్‌ 2-2 స్కోర్‌తో డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌లో శాంటోస్‌ చేసిన రెండు గోల్స్‌ను పీలేనే సాధించాడు. దీనిపై 2005లో టైమ్‌ పత్రిక కథనం వెలువరించింది. ‘‘దౌత్యవేత్తలు, మధ్యవర్తులు రెండేళ్లుగా యుద్ధాన్ని ఆపేందుకు యత్నిస్తున్నారు. కానీ, వారి వల్లకాలేదు. బ్రెజిల్‌ సాకర్‌ లెజెండ్‌ పీలే మాత్రం మూడు రోజుల కాల్పుల విరమణ తీసుకొచ్చాడు’’ అని పేర్కొంది.

కానీ, కాలక్రమంలో ఈ ప్రచారంపై పలు సవాళ్లు కూడా తలెత్తాయి. శాంటోస్‌ జట్టు యుద్ధాన్ని కూడా ప్రచారానికి వాడుకొందనే విమర్శలు వచ్చాయి. దీంతోపాటు శాంటోస్‌ పెద్దగా రిస్క్‌ ఉన్న ప్రదేశంలో మ్యాచ్‌ ఆడలేదనే ప్రచారం కూడా ఉంది. కానీ, ఫీలే ఫ్యాన్స్‌ మాత్రం ఇవేవీ అంగీకరించరు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని