IND vs AUS: బోర్డర్‌ - గావస్కర్ ట్రోఫీ.. అగ్గి రాజేశారు.. వారికి ఇది అలవాటే: అశ్విన్‌

భారత్‌తో టెస్టు సిరీస్‌ అనగానే ఆసీస్‌కు (IND vs AUS) మైండ్‌ గేమ్‌ మొదలు పెట్టేయడం పర్యాటక జట్టుకు అలవాటు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి టెస్టు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆసీస్‌ మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు మాటల యుద్ధం ప్రారంభించారు. వీటన్నింటికీ టీమ్‌ఇండియా (Team India) ఆటగాడు అశ్విన్‌ (Ashwin) ఘాటుగానే సమాధానం ఇచ్చాడు.

Published : 04 Feb 2023 01:44 IST

ఇంటర్నెట్ డెస్క్: ‘‘భారత్‌తో సిరీస్‌ ఉందంటే చాలు.. ఆస్ట్రేలియా మైండ్‌ గేమ్‌లకు పాల్పడటం సర్వసాధారణం. ఆ జట్టు స్లెడ్జింగ్‌కి ప్రసిద్ధి అని తెలుసు కదా.. ఇదే వారి క్రికెటింగ్ స్టైల్‌’’ అని భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ashwin) వ్యాఖ్యానించాడు. భారత సిరీస్‌పై ఆసీస్‌ ఆటగాళ్లు, మాజీలు చేస్తున్న వ్యాఖ్యలపై అశ్విన్‌ కాస్త ఘాటుగా స్పందించాడు. 

‘‘మంచి పిచ్‌లను రూపొందిస్తే ఆసీస్ తప్పకుండా గెలుస్తుంది’ అని ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ దిగ్గజం ఇయాన్ హీలీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్‌ అనగానే స్పిన్‌ పిచ్‌లకే ప్రాధాన్యం ఇస్తారని, అలా కాకుండా బ్యాటింగ్‌, ఫాస్ట్‌, స్పిన్‌ బౌలింగ్‌.. ఇలా మూడింటికి సమంగా సహకారం లభించేలా తయారుచేస్తే ఆసీస్‌ గట్టి పోటీనివ్వడం ఖాయమనే అర్థంలో ఇయాన్‌  హీలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల భారత్ - ఆస్ట్రేలియా సిరీస్‌కు మరింత ఊపు వస్తుందని అశ్విన్‌ అన్నాడు.

‘‘బోర్డర్ గావస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఆసీస్ క్రికెట్ దిగ్గజం అగ్గి రాజేసినట్లు ఉన్నారు. పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియన్లు భారత్‌లో అసౌకర్యానికి గురవుతారని ఇంతకుముందు ఆయన వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌ సందర్భంగా వారికి అనుగుణమైన పిచ్‌ను రూపొందించరని ముందే చెప్పాడు. అంటే ఆస్ట్రేలియా విధానమే కరెక్ట్‌ అనుకునేలా చేశాడు. దీంతో ట్రోఫీలో కాస్త అగ్గి రాజుకుంది. ఇదే కదా వారికి కావాల్సింది. తప్పకుండా ఆస్ట్రేలియన్ క్యాంప్‌ నుంచి ఇలాంటి పరిహాసపు మాటలు వస్తాయని భావిస్తున్నా. ఇప్పటికే స్టీవ్‌ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, మ్యాచ్‌ రెన్‌షా నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చాయి’’ అని అశ్విన్‌ తెలిపాడు. 

‘భారత్‌లో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అనవసరమని, అసలైన సమరంలో పిచ్‌లను వేరుగా తయారు చేస్తార’ని స్టీవ్‌ స్మిత్ చేసిన వ్యాఖ్యలపైనా అశ్విన్‌(Ashwin) స్పందించాడు. ‘‘ఆస్ట్రేలియా ఇటీవల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లను ఆడటం లేదు. టీమ్‌ఇండియా కూడా విదేశాలకు వెళ్లినప్పుడు వార్మప్‌ మ్యాచ్‌లు ఆడటం లేదు. అంతర్జాతీయ షెడ్యూలింగ్‌ కారణంగా  ఆ మ్యాచ్‌లను వదిలేస్తున్నారు. 2017లో వచ్చినప్పుడు వారికి పేస్‌ పిచ్‌ తయారు చేసి ఇచ్చి.. మొదటి టెస్టును పూర్తి వ్యతిరేకంగా ఉన్న పిచ్‌ మీద ఆడించారని స్మిత్ చెప్పాడు. వారికి గ్రీన్‌ ట్రాక్‌ ఇచ్చి ఉండొచ్చు. కానీ అవేమీ ప్రణాళిక ప్రకారం చేయలేదు’’ అని అశ్విన్‌ తెలిపాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని