Asia Cup 2023 News: టీమ్‌ఇండియానే ఫేవరేట్‌.. టోర్నీ లోగోపై ఆతిథ్య దేశం పేరు ఎందుకు లేదంటే?

Updated : 01 Sep 2023 15:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌లో (Asia Cup 2023) భారత్ శనివారం పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఇందులో టీమ్‌ఇండియా ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. ఎందుకనేది గణాంకాలే చెబుతాయి. ఇక టోర్నీ లోగో మీద ఆతిథ్య దేశం పాకిస్థాన్‌ పేరు లేకపోవడంపై ఆ జట్టు మాజీ క్రికెటర్లు పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఎలాంటి ఇగో లేదని టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్ మహమ్మద్ షమీ వ్యాఖ్యానించాడు. ఇలాంటి ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) విశేషాలు మీ కోసం.. 

దాయాదితో పోరు.. భారత్‌దే పైచేయి.. గణాంకాలు ఇవే

శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా పాకిస్థాన్‌తో తలపడనున్న మ్యాచ్‌లో భారత్‌ ఫేవరేట్‌. ఎందుకంటే ఇప్పటి వరకు ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లకు సంబంధించిన గణాంకాలే ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. తటస్థ వేదికల్లో పాక్‌పై భారత్‌ ఆధిక్యత ప్రదర్శించింది. ఒక్కసారి ఆ గణాంకాలను పరిశీలిస్తే.. తటస్థ వేదికల్లో భారత్‌ - పాక్‌ జట్ల మధ్య 55 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీమ్‌ఇండియా 33 విజయాలు నమోదు చేసింది. దాదాపు ఇది 60 శాతం. అలాగే శ్రీలంక వేదికగా ఆడిన వన్డేల్లో 56 శాతం విజయాలు భారత్‌వే. మరొక విజయం సాధిస్తే వన్డేల్లో భారత్‌ వెలుపల మైదానాల్లో అత్యధికంగా గెలిచిన జట్టుగా రికార్డు సాధించనుంది. గత పది వన్డేల్లో పాక్‌పై ఏడు మ్యాచుల్లో భారత్‌ గెలిచింది. అయితే, ఈసారి మాత్రం పాక్‌ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇప్పటికే నేపాల్‌పై ఘనవిజయంతో పాక్‌ పాయింట్ల పట్టికను తెరిచింది.


ఏసీసీ, పీసీబీపై పాక్‌ మాజీలు తీవ్ర ఆగ్రహం

ఆసియా కప్‌ ఆరంభ మ్యాచ్‌ పాకిస్థాన్‌ - నేపాల్ మధ్య బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆసియా కప్‌ లోగోను ఆవిష్కరించారు. అయితే, ఆ లోగోపై ఆతిథ్య దేశమైన పాకిస్థాన్‌ పేరు లేకపోవడం చర్చకు దారితీసింది. పాక్‌ మాజీ ఆటగాళ్లు పీసీబీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, దీనికి పీసీబీ స్పందిస్తూ.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) గతేడాది తీసుకున్న నిర్ణయం మేరకు ఆతిథ్య దేశం పేరును లోగోపై ముద్రించడం లేదని తెలిపింది. అయితే, దీనిపై మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్, మోహ్‌సిన్‌ ఖాన్‌ తీవ్రంగా స్పందించారు. 

ఆసియా కప్‌లో దాయాదుల పోరు.. ఎవరిది జోరు?

‘‘ఆసియా క్రికెట్‌ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఆమోదయోగ్యం కాదు. అయినా పీసీబీ దీనికి ఎలా అంగీకరించింది? తప్పకుండా దీనిపై వివరణ ఇవ్వాల్సిందే. దాదాపు 15 ఏళ్లలో తొలిసారి ఇలాంటి మల్టీనేషన్ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాక్‌కు తగినంత ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఒకవేళ ఆతిథ్య జట్టు లోగో వేయకూడదని భావిస్తే.. ఇటీవలే ముగిసిన ఎమర్జింగ్‌ నేషనల్‌ కప్, అండర్‌ - 16 ఈవెంట్‌కు సంబంధించిన టోర్నీల్లో లోగోలపై హోస్ట్ పేర్లను ఉంచారు’’ అని విమర్శించారు.


నాకు ఎలాంటి ఇగో లేదు: షమీ

టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్ మహమ్మద్ షమీ ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ కోసం సిద్ధమవుతున్నాడు. శ్రీలంక వేదికగా భారత్‌ మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో ముగ్గురు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగుతుందా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ ఇద్దరిని తీసుకుంటే తుది జట్టులో బుమ్రాతోపాటు సిరాజ్‌ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ. అయితే, కీలకమైన పోరులో షమీని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఈ క్రమంలో తనకు ఏ దశలో అవకాశం వచ్చినా బౌలింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉంటానని, ఇందులో తనకేమీ అహం లేదని షమీ వ్యాఖ్యానించాడు. అలాగే కొత్త బంతినిచ్చినా.. లేదా మిడిల్‌ ఓవర్లలో బౌలింగ్‌ ఇచ్చినా చేస్తానని స్పష్టం చేశాడు. 

టీమ్‌ఇండియాకు ఆసియా కప్‌ను అందించిన కెప్టెన్లు వీరే..

‘‘జట్టు అవసరానికి తగ్గట్టుగా ఆడటమే నాకు తెలుసు. కొత్త బంతి ఇస్తేనే బౌలింగ్‌ చేస్తా..? అనే డిమాండ్లు పెట్టే రకం కాదు. అసలు అలాంటి ఇగో కూడా నాకు లేదు. మేం ముగ్గురం (బుమ్రా, సిరాజ్‌) అద్భుతమైన ఫామ్‌లోనే ఉన్నాం. కాబట్టి, మైదానంలోకి దిగితే వంద శాతం విజయం కోసం ప్రయత్నిస్తాం. మా ప్రణాళికలను అమలు చేస్తే చాలు గెలవడం చాలా సులభమవుతుంది. ఇప్పుడు వైట్‌ బాల్, రెడ్‌బాల్‌ అనేది చర్చనీయాంశమే కాదు. ఎందుకంటే సరైన ప్రాంతంలో సంధిస్తే ఏ బంతైనా ఒకటే ఫలితం రాబడుతుంది’’ అని షమీ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని