WTC Final: కివీస్‌ అభిమానులకు క్షమాపణలు 

టీమ్‌ఇండియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ విజేతగా నిలవడంతో ఆస్ట్రేలియా టెస్టు సారథి టిమ్‌పైన్‌ ఆ దేశస్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు.

Published : 27 Jun 2021 01:13 IST

తప్పుడు అంచనా వేసినందుకు టిమ్‌పైన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ విజేతగా నిలవడంతో ఆస్ట్రేలియా టెస్టు సారథి టిమ్‌పైన్‌ ఆ దేశస్థులకు బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఈ తుదిపోరుకు ముందు పైన్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ టీమ్‌ఇండియానే విజేతగా నిలుస్తుందని అంచనా వేశాడు. దాంతో అతడు కివీస్‌ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఫైనల్‌లో న్యూజిలాండ్‌ తొలి టెస్టు ఛాంపియన్‌గా నిలవడంతో ఆ దేశానికి చెందిన ఓ రేడియో కార్యక్రమంలో పైన్‌ మాట్లాడాడు. ఈ సందర్భంగా కివీస్‌ అభిమానులకు ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పాడు.

‘మనమంతా కొన్ని సందర్భాల్లో తప్పుడు అంచనా వేస్తాం. దాంతో నేను కూడా న్యూజిలాండ్‌ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాను. ఇప్పుడా జట్టు విజయం సాధించిన నేపథ్యంలో ఆ దేశ అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెబుతున్నాను. అలాగే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ అత్యద్భుతంగా ఆడింది. విలియమ్సన్‌ టీమ్ విజయం కోసం ఆరాటపడే విధానం చూసేందుకు కన్నులపండుగగా ఉంటుంది. నేను తస్మానియా నుంచి వచ్చాను. అది ఆస్ట్రేలియాలోనే చాలా చిన్న రాష్ట్రం. అయినా, మేం మాకన్నా బలంగా ఉన్న వారిని ఢీకొడతాం. కాబట్టి అంతర్జాతీయ వేదికపై న్యూజిలాండ్ సత్తా చాటినప్పడు, దాన్ని నేను కచ్చితంగా గౌరవిస్తా’ అని ఆసీస్‌ కెప్టెన్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని