1994 తర్వాత చెన్నై టెస్టులోనే ఇలా..

ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా అద్భత విజయం సాధించాక అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ శుక్రవారం ప్రారంభమైంది...

Updated : 05 Feb 2021 12:56 IST

చెన్నై: ఆస్ట్రేలియాపై టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించాక అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ శుక్రవారం ప్రారంభమైంది. తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఓ ప్రత్యేకత కూడా చోటుచేసుకుంది. అదేమిటంటే.. 1994 తర్వాత భారత్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో.. తొలిసారి ఇద్దరు స్వదేశీ అంపైర్లు మైదానంలోకి అడుగుపెట్టారు.

1994 ఫిబ్రవరిలో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన ఒక టెస్టు మ్యాచ్‌లో భారత అంపైర్లు ఎల్‌.నరసింహన్‌, వీకే రామస్వామి ఆ మ్యాచ్‌ను పర్యవేక్షించారు. ఆ తర్వాత మళ్లీ 27 ఏళ్లకు చెన్నై టెస్టులో ఆ విశేషం చోటుచేసుకుంది. భారత్‌-ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌కు ఐసీసీ కొద్ది రోజుల క్రితమే నితిన్‌ మీనన్‌, అనిల్‌ చౌదరీ, వీరేందర్‌ శర్మ అనే ముగ్గురు ఐసీసీ ప్యానల్‌ అంపైర్లను నియమించింది. ఈ నేపథ్యంలోనే తొలి టెస్టులో అనిల్‌, నితిన్‌ బరిలోకి దిగారు. ఇక రెండో టెస్టులో వీరేందర్‌, నితిన్‌కు తోడుగా మరో అంపైర్‌గా వ్యవహరించనున్నారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి, అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ మ్యాచ్‌లకు స్థానిక అంపైర్లను నియమించుకునే అవకాశాన్ని ఐసీసీ అనుమతించింది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ ప్యానల్‌ అంపైర్లలో సభ్యులైన అనిల్‌, వీరేందర్‌, నితిన్‌లకు ఈ అవకాశం వచ్చింది. మరోవైపు తొలి రెండు టెస్టులకు జవగళ్‌ శ్రీనాథ్‌ మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించనున్నారు.
ఇవీ చదవండి..
యాష్‌తో మినీ సమరం..పుజారా భారీ వికెట్‌
కోహ్లీ 31లోనైనా 71 చేరుకుంటాడా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని