Jaydev Unadkat: 12 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చి.. తొలి వికెట్‌తో అదరగొట్టి..

12 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి అడుగుపెట్టిన సీనియర్‌ బౌలర్‌ ఉనద్కత్‌.. తన టెస్టు కెరీర్‌లో తొలి వికెట్‌ తీసుకున్నాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో బౌలింగ్‌తో అదరగొట్టాడు.

Published : 22 Dec 2022 10:53 IST

మీర్పూర్‌: పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత జట్టులోకి వచ్చిన సీనియర్‌ బౌలర్‌ జయ్‌దేవ్‌ ఉనద్కత్‌ తళుక్కున మెరిశాడు.  తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి వికెట్‌ పడగొట్టి క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ల భాగస్వామ్యాన్ని విడదీశాడు.

రెండో టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌ స్థానంలో ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌కు జట్టులో చోటు దక్కింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు నజ్ముల్‌ హొస్సేన్‌, జాకిర్ హసన్‌ ఇన్నింగ్స్‌ను నిలకడగా మొదలుపెట్టారు. అయితే 15వ ఓవర్‌లో ఉనద్కత్‌ వేసిన ఐదో బంతిని జాకిర్‌(15) షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా.. కెప్టెన్ రాహుల్‌ క్యాచ్‌ పట్టాడు. దీంతో బంగ్లా తొలి వికెట్‌ కోల్పోయింది. టెస్టుల్లో ఉనద్కత్‌కు ఇదే తొలి వికెట్‌ కావడం విశేషం. ఆ తర్వాతి ఓవర్లో అశ్విన్‌ మాయ చేసి మరో ఓపెనర్‌ హొస్సేన్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ప్రస్తుతం 18 ఓవర్లు పూర్తయ్యేసరికి బంగ్లా రెండు వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది.

ఉనద్కత్‌ ‘అరుదైన’ రికార్డు..

2010లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన 31 ఏళ్ల ఉనద్కత్.. ఆ ఏడాది డిసెంబరు 16న దక్షిణాఫ్రికాపై జరిగిన టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ఇప్పడు రెండో టెస్ట్‌ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఈ పేసర్‌ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత ఎక్కువ మ్యాచ్‌లకు దూరమైన తొలి భారత క్రికెటర్‌ ఇతడే. ఇక, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెస్టులకు దూరమైన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఉనద్కత్‌ తన కెరీర్‌లో మొత్తంగా 118 టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి కంటే ముందు ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ గెరిత్‌ బ్యాటీ టెస్టు క్రికెట్‌లో 142 మ్యాచ్‌లు మిస్సయ్యాడు.

అయితే భారత్‌ తరఫున ఉనద్కత్‌ ఏడు వన్డేలు, 10 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. తాజాగా విజయ్‌ హజారే ట్రోఫీలో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శనతో ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ జట్టులోకి వచ్చాడు. 10 మ్యాచుల్లో 19 వికెట్లు తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు