UPW vs DCW: ఆదుకున్న మెక్‌గ్రాత్.. దిల్లీ ముందు మోస్తారు లక్ష్యం

డబ్ల్యూపీఎల్‌ (WPL) యూపీ వారియర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య చివరి లీగ్‌ మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.

Updated : 21 Mar 2023 21:18 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌ (WPL)లో యూపీ వారియర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య చివరి లీగ్‌ మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. తాహిలా మెక్‌గ్రాత్ (58; 32 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో జట్టుని ఆదుకుంది. అలీసా హీలే (36; 34 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌),  శ్వేతా సెహ్రవత్‌ (19),  సిమ్రాన్ షేక్ (11) పరుగులు చేయగా.. కిరణ్ నవ్‌గిరె (2), దీప్తి శర్మ (3) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు.  దిల్లీ బౌలర్లలో క్యాప్సే మూడు, రాధా యాదవ్ రెండు, జోనాసెన్‌ ఒక వికెట్ పడగొట్టారు.

ఓపెనర్లు అలీసా హీలే, శ్వేతా సెహ్రావత్ యూపీకి శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే, రాధా యాదవ్‌ వేసిన ఐదో ఓవర్‌లో తొలి బంతికి శ్వేతా జోనాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగింది. తర్వాత సిమ్రాన్‌, హీలే నిలకడగా ఆడారు. ప్రమాదకరంగా మారుతున్న హీలేను 10 ఓవర్‌లో క్యాప్సే ఔట్‌ చేసింది. కొద్ది సేపటికే సిమ్రాన్‌ను రాధా యాదవ్‌ వెనక్కి పంపింది. జోనాసెన్‌ వేసిన 15 ఓవర్‌లో కిరణ్ నవ్‌గిరె స్టంపౌటయ్యింది. క్యాప్సే వేసిన 17 ఓవర్‌లో దీప్తి శర్మ, ఎకిల్ స్టోన్‌ కూడా స్టంపౌటయ్యారు. చివరి రెండు ఓవర్లలో మెక్‌గ్రాత్ దూకుడుగా ఆడటంతో యూపీ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆఖరి రెండు ఓవర్లలో 33 పరుగులొచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని