WPL: యూపీ వారియర్స్‌ ఆలౌట్‌.. బెంగళూరు ముందు స్వల్ప లక్ష్యం

డబ్ల్యూపీఎల్‌ (WPL)లో భాగంగా యూపీ వారియర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ జట్టు.. 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.

Updated : 15 Mar 2023 21:26 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌ (WPL)లో భాగంగా యూపీ వారియర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ జట్టు.. 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. గ్రేస్ హారిస్ (46; 32  బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. కిరణ్‌ నవ్‌గిరె (22), దీప్తి శర్మ (22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో ఎల్లీస్‌ పెర్రీ మూడు వికెట్లు పడగొట్టగా.. సోఫీ డివైన్‌, ఆశా శోభనా రెండేసి వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మేఘన్ స్కట్, శ్రేయంకా పాటిల్ తలో వికెట్ తీశారు.  

ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్లోనే దేవికా వైద్య (0), అలీసా హేలీ (1)ని పెవిలియన్‌కు పంపి యూపీని గట్టి దెబ్బ కొట్టింది సోఫీ డివైన్‌. మేఘన్‌ స్కట్ వేసిన తర్వాతి ఓవర్లో తాహిలా మెక్‌గ్రాత్ (2) వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది. దీంతో ఐదు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన యూపీని గ్రేస్‌ హారిస్‌ ఆదుకుంది. కిరణ్‌ నవ్‌గిరెతో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. నిలకడగా ఆడుతున్న నవ్‌గిరెను ఏడో ఓవర్లో ఆశా శోభనా ఔట్‌ చేసింది. తర్వాత క్రీజులోకి వచ్చిన సిమ్రాన్ షేక్ (2) కూడా శోభనానే వెనక్కి పంపింది.  ఓ వైపు  వికెట్లు పడుతున్నా.. గ్రేస్‌ హారిస్‌ నిలకడగా ఆడింది. శ్రేయాంకా పాటిల్ వేసిన 11 ఓవర్లో ఓ సిక్స్‌, ఫోర్‌ బాదింది. శోభనా వేసిన 12 ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌ రాబట్టింది. దీప్తి శర్మ, హారిస్‌లను పెర్రీ ఒకే ఓవర్లో ఔట్‌ చేసింది. తర్వాత వచ్చిన శ్వేత (6), అంజలి (8), రాజేశ్వరి గైక్వాడ్ (12) పరుగులు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని