
Virat Kohli: జట్టు ప్రయోజనాల కోసమే కోహ్లి అలా చేశాడు : పార్థివ్ పటేల్
ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి.. జట్టు ప్రయోజనాల కోసమే తనకు చెల్లించే మొత్తాన్ని తగ్గించుకున్నాడని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ అన్నాడు. గత సీజన్లో రూ.17 కోట్లు తీసుకున్న విరాట్ కోహ్లి.. ఐపీఎల్-2022 సీజన్కి రూ. 15 కోట్లే తీసుకోనున్నాడు. మరోవైపు ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు రూ. 11 కోట్లు, పేసర్ మహమ్మద్ సిరాజ్కు రూ. 7 కోట్లు వెచ్చించి ఆర్సీబీ రిటెయిన్ చేసుకున్న విషయం తెలిసిందే. గత ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్న హర్షల్ పటేల్, లెగ్ స్పిన్నర్ యుజువేంద్ర చాహల్లను ఆర్సీబీ అట్టిపెట్టుకోకపోవడం గమనార్హం.
‘జట్టు ప్రయోజనాల కోసమే కోహ్లి తన ఫీజులో కోత విధించుకున్నాడు. ఒక వేళ అతడు రూ.17 కోట్లు తీసుకుంటే.. ఫ్రాంఛైజీ పర్స్లో రెండు కోట్లు తగ్గుతాయి. అదే రూ.15 కోట్లు తీసుకుంటే.. జట్టుకి రూ. 2 కోట్లు మిగిల్చినట్లవుతుంది. దాంతో ఇతర ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడనిపిస్తోంది. విరాట్ కోహ్లి ఎంత నాణ్యమైన ఆటగాడో మనందరికీ తెలుసు. అతడు తీసుకున్న నిర్ణయం సరైనదే’ అని పార్థివ్ పటేల్ అన్నాడు.
జట్టు కోసం ఇంకా చాలా చేయాల్సి ఉంది : విరాట్ కోహ్లి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడటం తప్ప.. తనకు మరో ఆలోచన లేదని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. క్రికెట్ నుంచి తప్పుకునేంత వరకు బెంగళూరు జట్టుకే ఆడతానని అన్నాడు. గత ఐపీఎల్ సీజన్లో ప్లే ఆఫ్స్లో ఓడిపోవడంతో ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ‘బెంగళూరు జట్టుకు ఆడటం తప్ప నాకు మరో ఆలోచన లేదు. జట్టు కోసం ఇంకా చాలా చేయాల్సి ఉంది. వచ్చే సీజన్లో గొప్పగా రాణించగలననే నమ్మకం ఉంది. ఆర్సీబీ ఆటగాడిగా మరింత నిబద్ధతతో ఆడేందుకు ప్రయత్నిస్తాను’ అని కోహ్లి అన్నాడు. ఐపీఎల్-2021 సీజన్ తర్వాత కోహ్లి ఆర్సీబీ కెప్టెన్గా తప్పుకున్న విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.