Virat Kohli: బెంగళూరు అభిమానులకు విరాట్ కోహ్లీ స్పెషల్ మెసేజ్‌

టీ20 లీగ్‌లో ఏటా ‘ఈ సాలా కప్‌ నమదే’ అంటూ వచ్చే బెంగళూరును ఈ సారి కూడా దురదృష్టం వెంటాడింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో బెంగళూరుపై రాజస్థాన్‌ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టైటిల్‌ కల

Published : 29 May 2022 01:27 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్‌లో ఏటా ‘ఈ సాలా కప్‌ నమదే’ అంటూ వచ్చే బెంగళూరును ఈ సారి కూడా దురదృష్టం వెంటాడింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌-2లో బెంగళూరుపై రాజస్థాన్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టైటిల్‌ కల నెరవేరకుండానే బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ పరిణామంతో ఇటు బెంగళూరు, అటు విరాట్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొంతమంది అభిమానులు భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక కన్నీరు కూడా పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టుపై చూపుతున్న ప్రేమాభిమానాలను దృష్టిలో ఉంచుకుని ట్విటర్‌ వేదికగా అభిమానులను ఉద్దేశించి విరాట్‌ కోహ్లీ ఓ స్పెషల్‌ మెసేజ్‌ చేశాడు. ‘కొన్నిసార్లు మీరు (అభిమానులు) గెలుస్తారు, కొన్నిసార్లు మీరు గెలవలేరు. ఈ సీజన్‌ అంతా మాకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆటను ప్రత్యేకంగా ఉండేలా చేశారు. నేర్చుకోవడం ఎప్పుడూ ఆగదు. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీలో భాగమైన యాజమాన్యానికి, సహాయక సిబ్బందికి, అభిమానులకు కృతజ్ఞతలు. మళ్లీ వచ్చే సీజన్‌లో కలుద్దాం’ అని విరాట్ కోహ్లీ ట్వీట్‌ చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లీ బ్యాటర్‌గా నిరాశపరిచాడు. 16 మ్యాచ్‌లు ఆడి 22.73 సగటుతో 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉండగా, ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే టీ20 లీగ్‌ ఫైనల్‌లో గుజరాత్, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని