అంపైర్లకు ఆ అవకాశం ఎందుకు లేదో తెలియదు..! 

గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(57; 31 బంతుల్లో 6x4, 3x6) ఔటైన వివాదాస్పద తీర్పుపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు...

Updated : 19 Mar 2021 15:18 IST

సూర్య వివాదాస్పద ఔట్‌పై కోహ్లీ మండిపాటు

ఇంటర్నెట్‌డెస్క్‌: గతరాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(57; 31 బంతుల్లో 6x4, 3x6) ఔటైన తీరు వివాదాస్పదమైంది. దీనిపై కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సామ్‌కరన్‌ వేసిన 14వ ఓవర్‌ రెండో బంతికి సూర్య ఆడిన షాట్‌ను డేవిడ్‌ మలన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. అయితే, అదే సమయంలో బంతి నేలకు తాకినట్లు కనిపించినా ఫీల్డ్‌ అంపైర్‌ ఔటిచ్చాడు. విషయం థర్డ్‌ అంపైర్‌కు చేరడంతో రీప్లే చూసి దాన్ని అనుమానాస్పద ఔట్‌గా భావించి అంపైర్స్‌కాల్‌ ఆధారంగా ఔట్‌గా ప్రకటించాడు.

ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ కోహ్లీ మాట్లాడుతూ సూర్యకుమార్‌పై ప్రశంసలు కురిపించాడు. తొలిసారి బ్యాటింగ్‌ చేస్తూనే అద్భుతమైన ప్రదర్శన చేశాడని మెచ్చుకున్నాడు. ఇషాన్‌లాగే మెరుపు బ్యాటింగ్‌ చేశాడన్నాడు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవంతో ఈ యువకులు ఇక్కడ భయం లేకుండా ఆడుతున్నారన్నాడు. అనంతరం సూర్య ఔట్‌పై స్పందించిన కోహ్లీ ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అస్పష్టంగా ఉన్నప్పటికీ ఫీల్డ్‌ అంపైర్‌ సాఫ్ట్‌ సిగ్నల్‌ ఔటివ్వడంపై కెప్టెన్‌ ఆశ్చర్యపోయాడు. ఇలాంటి నిర్ణయాలు వివాదాస్పదమౌతాయని కోహ్లీ అన్నాడు.

‘టెస్టు సిరీస్ సమయంలో నేను అజింక్య రహానె పక్కన ఉన్నప్పుడు ఇలాంటిదే ఒకటి చోటుచేసుకుంది. రహానే క్యాచ్‌ స్పష్టంగా పట్టుకున్నా దానిపై అతడు కచ్చితంగా లేడు. దాంతో మేం థర్డ్‌ అంపైర్‌ నిర్ణయానికి వెళ్లాం. ఇలాంటి విషయాల్లో ఫీల్డరే సందేహాస్పదంగా ఉంటే, స్క్వేర్ లెగ్‌లో ఉన్న అంపైర్ స్పష్టంగా చూసే ప్రసక్తే లేదు. ఫీల్డ్‌ అంపైర్‌ సాఫ్ట్‌ సిగ్నల్‌ అనేది చాలా ముఖ్యమైనది. అలాంటప్పుడు అంపైర్లకు కూడా ‘ఐ డోంట్‌ నో కాల్‌’ అనేది ఎందుకు ఉండకూడదో నాకు అర్థంకావడం లేదు. అది అంపైర్ కాల్‌లాగే ఉంటుంది. ఈ నిర్ణయాలు మ్యాచ్‌ల ఫలితాలను మార్చగలవు. ఈరోజు మేం దాన్ని ఎదుర్కొన్నాం. రేపు వేరే జట్టు ఇలాంటి స్థితిలో ఉండొచ్చు. ఇలాంటి వాటిని ఆటలో నుంచి తొలగించి ఉన్నతంగా తీర్చిదిద్దాలి. కీలకమైన మ్యాచ్‌ల్లో ఇలాంటివి సరికావు. మైదానంలో కచ్చితమైన స్పష్టత ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని కోహ్లీ అన్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 9 ఓవర్లకే 70/3 స్కోర్‌తో నిలిచింది. కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునే క్రమంలో సూర్య కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు అర్ధశతకం పూర్తి చేసుకొని మరింత వేగంగా పరుగులు చేసే సమయంలో ఔటయ్యాడు. ఆపై శ్రేయస్‌ అయ్యర్‌(37; 18 బంతుల్లో 5x4, 1x6), పంత్‌(30; 23 బంతుల్లో 4x4), పాండ్య(11), శార్దూల్‌ ఠాకుర్‌(10) మెరవడంతో జట్టు స్కోర్‌ 185/8గా నమోదైంది. తర్వాత ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 177/8 స్కోర్‌ సాధించి 8 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జేసన్‌రాయ్‌(40; 27 బంతుల్లో 6x4, 1x6), బెన్‌స్టోక్స్‌(46; 23 బంతుల్లో 4x4, 3x6) మెరుపుబ్యాటింగ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని