కోహ్లీ అలా చేస్తాడనుకోలేదు: శార్దూల్‌ ఠాకూర్‌

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలకడంపై.. ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ తాజాగా స్సందించాడు. కోహ్లీ సారథ్యంలో భారత్‌ గొప్ప విజయాలు సాధించిందని..

Published : 04 Feb 2022 02:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలకడంపై.. ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ తాజాగా స్పందించాడు. కోహ్లీ సారథ్యంలో భారత్‌ గొప్ప విజయాలు సాధించిందని పేర్కొన్నాడు. అతడు టెస్టు సారథ్యాన్ని వదిలేస్తాడని ఎవరూ ఊహించలేదని చెప్పాడు. అలాగే, హార్దిక్‌ పాండ్యతో తనకు ఎలాంటి పోటీ లేదని, కెప్టెన్లు మారినా తన పాత్రలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశాడు. 

‘కోహ్లీ టెస్టు కెప్టెన్సీ వదులుకోవడం చాలా బాధాకరం. అతడు ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కోహ్లీ సారథ్యంలో టీమ్ఇండియా గొప్ప విజయాలు సాధించింది. ప్రత్యేకించి విదేశాల్లో చరిత్ర సృష్టించింది. చాలా తక్కువ మ్యాచుల్లో మేం ఓడిపోయాం. అది కూడా స్వల్ప తేడాతోనే పరాజయం పాలయ్యాం. ఏదేమైనా అతడు తీసుకున్న నిర్ణయాన్ని మనమంతా గౌరవించాల్సిన అవసరం ఉంది’ అని శార్దూల్‌ ఠాకూర్‌ పేర్కొన్నాడు.

* హార్దిక్‌తో నన్ను పోల్చొద్దు..

‘హార్దిక్‌ 5 లేదా 6 స్థానాల్లో బ్యాటింగ్‌కి దిగుతాడు. నేను 7 లేదా 8 స్థానాల్లో క్రీజులోకి వస్తాను. మా ఇద్దరి బ్యాటింగ్‌ శైలీ వేర్వేరుగా ఉంటుంది. మా మధ్య ఎలాంటి పోటీ కానీ, పోలికలు కానీ లేవు. అతడి స్థానాన్ని ఆక్రమించాలని నేనెప్పుడూ అనుకోలేదు. అతడు కూడా నాకు ఎల్లప్పుడూ మద్దతుగానే నిలిచాడు. తన అనుభవాలను నాతో పంచుకునేవాడు’ అని శార్దూల్‌ చెప్పాడు.

* కెప్టెన్‌ మారినా.. నా పాత్ర మారదు..

‘జట్టును నడిపించే సారథులు మారినా.. నా పాత్రలో ఎటువంటి మార్పు ఉండదు. ఒక్కో కెప్టెన్‌కి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కానీ, అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే.. జట్టును విజయ తీరాలకు చేర్చడం. మనం ఎవరి నాయకత్వంలో ఆడుతున్నామన్నది ముఖ్యం కాదు. జట్టు విజయం కోసం ఏ మేరకు కృషి చేశామన్నదే ముఖ్యం’ అని శార్దూల్‌ ఠాకూర్‌ పేర్కొన్నాడు. గతంలో ఠాకూర్‌.. విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్‌, రోహిత్‌ శర్మ సారథ్యంలో ఆడిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని