Virat Kohli : ఐదో టెస్టు రద్దుపై కోహ్లీ వివరణ ఇవ్వాలి : ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌

ఇంగ్లాండ్‌తో జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్ రద్దు కావడానికి దారితీసిన పరిస్థితులపై టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వివరణ ఇవ్వాలని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ కోరాడు...

Updated : 14 Sep 2021 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్కు : ఇంగ్లాండ్‌తో జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్ రద్దు కావడానికి దారితీసిన పరిస్థితులపై టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వివరణ ఇవ్వాలని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ కోరాడు. లేకపోతే అది మరిన్ని అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నాడు. ‘ఇంతకు ముందు కూడా మ్యాచులు రద్దు అయ్యాయి. అయితే, ఈ మ్యాచ్‌ రద్దవ్వడానికి ముందు రోజు అర్ధరాత్రి కోహ్లీ బీసీసీఐకి లేఖ రాశాడు. కాబట్టి, మ్యాచ్‌ రద్దవ్వడానికి దారి తీసిన పరిస్థితులపై అతడు వివరణ ఇస్తే బాగుంటుంది. ఒకవేళ ఐపీఎల్‌ కారణంగానే ఈ మ్యాచ్‌ను రద్దు చేసి ఉంటే.. నాలాంటి టెస్టు క్రికెట్‌ అభిమానులను నిరాశకు గురి చేసినట్లే. ఎందుకంటే, గతంలో టెస్టు క్రికెట్ ఎంత ముఖ్యమో కోహ్లీ చెప్పాడు’ అని గోవర్‌ పేర్కొన్నాడు. కాగా, టీమ్‌ఇండియా శిబిరంలో సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంతో.. ఈ నెల 10 నుంచి జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్‌ రద్దయిన విషయం తెలిసిందే.

మరోవైపు ఐదో టెస్టు రద్దయిన అనంతరం దుబాయ్‌ చేరుకున్న కోహ్లీ ‘ఆర్‌సీబీ బోల్డ్‌ డైరీస్‌’లో మాట్లాడాడు. ‘ఐపీఎల్‌ కోసం త్వరగా దుబాయ్‌ చేరుకోవడం దురదృష్టకరం. కానీ, కరోనా వల్ల అనిశ్చితి ఎక్కువగా ఉంది. ఏ సమయంలో ఏదైనా జరగొచ్చు. ఐపీఎల్‌లో బయో బబుల్‌ అత్యంత సురక్షితంగా ఉంటుందని, నాణ్యమైన టోర్నీని చూస్తామని ఆశిస్తున్నా’ అని కోహ్లీ అన్నాడు. ఇదిలా ఉండగా, ఐపీఎల్‌ కారణంగానే చివరి టెస్టును రద్దు చేశారని వస్తున్న వార్తలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ కొట్టి పారేశాడు. ‘బీసీసీఐ బాధ్యతాయుతమైన బోర్డు. మేం ఇతర బోర్డులను గౌరవిస్తాం. టీమ్‌ఇండియా జూనియర్‌ ఫిజియో కరోనా బారిన పడటంతో ఆటగాళ్లంతా మ్యాచ్‌ ఆడటానికి భయపడ్డారు. అందుకే మ్యాచును రద్దు చేశాం’ అని గంగూలీ స్పష్టతనిచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని