Virat Kohli: విరాట్ కోహ్లీ.. టీ20లు ఆడటం ఆపేయ్‌: షోయబ్‌ అక్తర్‌

టీ20 క్రికెట్ విరాట్ కోహ్లీ (Virat Kohli) శక్తిని చాలా వరకు హరిస్తుందని,  అందువల్ల పొట్టి ఫార్మాట్‌ను వదిలేసి వన్డేలు, టెస్టులకు మాత్రమే పరిమితం కావాలని అక్తర్‌ సూచించాడు.

Published : 22 Mar 2023 02:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (100) బాదిన రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్ పేరిట ఉంది. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (75) శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసే అవకాశం ఒక్క కోహ్లీకే ఉంది. ఈ నేపథ్యంలో విరాట్‌కు పాక్‌ మాజీ ఫాస్ట్‌బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ చాలా భిన్నమైన సూచన చేశాడు. టీ20 క్రికెట్ అతని శక్తిని చాలా వరకు హరిస్తుందని,  అందువల్ల పొట్టి ఫార్మాట్‌ను వదిలేసి వన్డేలు, టెస్టులకు మాత్రమే పరిమితం కావాలని అక్తర్‌ సూచించాడు.

‘‘ఒక క్రికెటర్‌గా మీరు నన్ను అడిగితే.. విరాట్ కోహ్లీ టీ20లు ఆడటం మానేసి టెస్టు, వన్డే ఫార్మాట్‌లకు మాత్రమే పరిమితం కావాలని భావిస్తున్నా. టీ20 క్రికెట్‌ అతని శక్తిని చాలా వరకు హరిస్తుంది. కోహ్లీ ఎంతో ఉత్సాహంగా ఉండే వ్యక్తి.  టీ20ల్లో ఆడాలనుకుంటున్నాడు. అతనికి ఈ ఫార్మాట్‌ అంటే ఇష్టం. కానీ, ఈ సమయంలో విరాట్ తన శరీరాన్ని కాపాడుకోవాలి. ప్రస్తుతం అతని వయస్సు 34. ఇంకో 6-8 ఏళ్లు సులభంగా ఆడగలడు. మరో 30-50 టెస్టు మ్యాచ్‌లు ఆడితే ఆ మ్యాచ్‌ల్లో 25 సెంచరీలు చేయడం అతనికి కష్టం కాదని కచ్చితంగా అనుకుంటున్నా. కోహ్లీ ఫిట్‌నెస్‌ని, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయాలి. ప్రస్తుతం ఆసియాలో  విరాట్ కోహ్లీ, బాబర్‌ అజామ్‌ గొప్ప ఆటగాళ్లు’’ అని షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని