IPL 2022 - RCB : ఆర్‌సీబీ అభిమానుల కోసం విరాట్ కోహ్లీ గ్లిమ్స్!

రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్‌గా ఎంపికయ్యే ఆ అదృష్టవంతుడు ఎవరనేది...

Updated : 14 Mar 2022 20:23 IST

ఇంటర్నెట్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కెప్టెన్‌గా ఎంపికయ్యే ఆ అదృష్టవంతుడు ఎవరనేది మరో రెండు రోజుల్లో తేలనుంది. ఈలోగా ఆర్‌సీబీ సస్పెన్స్‌పై మాజీ సారథి విరాట్ కోహ్లీ గ్లిమ్స్‌ వదిలాడు. ఐపీఎల్ 15వ సీజన్ పోటీలు మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కనీసం రెండు వారాలు ముందే కెప్టెన్‌గా నియమించాలని ఆర్‌సీబీ యాజమాన్యం భావించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ట్విటర్ వేదికగా వీడియోను షేర్‌ చేశాడు.

‘‘హాయ్‌, మీ కోసం కొన్ని అప్‌డేట్స్‌ తీసుకొచ్చా. త్వరలో మనం కొత్త సీజన్‌ను ప్రారంభించబోతున్నాం. పునరుత్తేజంతో నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నా. అయితే అన్నింటి కంటే ముందు ఇంకో ముఖ్యమైన విషయం ఉంది... అదీ... ’’ అని వీడియోలో కోహ్లీ చెప్పాడు. చివర్లో విరాట్ ఏమన్నాడో అర్థం కాకుండా ఫార్వర్డ్‌ చేయడంతో అసలు విషయం ఏంటా? అని అభిమానులు తీవ్రంగా చర్చిస్తున్నారు. బెంగళూరు వేదికగా ‘ఆర్‌సీబీ అన్‌బాక్స్’ పేరిట ప్రత్యేకంగా ప్రమోషన్‌ ఈవెంట్‌ను ఆర్‌సీబీ నిర్వహించనుంది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం భాగం కాలేకపోతున్నాడు. మార్చి 12 నుంచి లంకతో డే/నైట్ టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. విరాట్ స్థానంలో డుప్లెసిస్‌ కానీ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కానీ జట్టు పగ్గాలను చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పనిభారం నుంచి విరామం తీసుకునేందుకు గత సీజన్‌ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీని వదిలేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని