Mayank Agarwal : మయాంక్.! నువ్వో కెప్టెన్‌వనే విషయం మర్చిపో.! : సెహ్వాగ్

టీ20 మెగా టోర్నీలో పంజాబ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ ఫామ్‌పై టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడు నిలకడగా...

Published : 09 Apr 2022 01:42 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 మెగా టోర్నీలో పంజాబ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ ఫామ్‌పై టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆందోళన వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతడు నిలకడగా రాణించలేకపోతున్నాడని పేర్కొన్నాడు. తనో జట్టుకు కెప్టెన్‌ అనే విషయాన్ని మర్చిపోయి స్వేచ్ఛగా ఆడాలని సూచించాడు.

‘పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మయాంక్ అగర్వాల్‌ నిలకడగా రాణించలేకపోతున్నాడు. అంతకు ముందు సీజన్లలో అతడు మెరుగైన ప్రదర్శన చేశాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినంత మాత్రాన అతడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తనో జట్టుకు నాయకుడనే విషయాన్ని మర్చిపోయి బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలి. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలి. వన్డే, టెస్టు ఫార్మాట్లలో క్రీజులో కుదురుకునే వరకు నెమ్మదిగా ఆడినా ఫర్వాలేదు. ఆ తర్వాత పరుగులు రాబట్టవచ్చు. కానీ, టీ20 ఫార్మాట్లో ఆరంభం నుంచే ఎదురుదాడి ప్రారంభించాలి. లేకపోతే వెనుకబడిపోతాం. పంజాబ్ జట్టు బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. వారు ప్రత్యర్థి జట్టును కట్టడి చేయగలరు. కాబట్టి, బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడాలి’ అని సెహ్వాగ్ సూచించాడు. మయాంక్‌ ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లో వరుసగా 32, 1, 4 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

గత సీజన్లతో పోలిస్తే ఈ సారి పంజాబ్ జట్టు మెరుగ్గా రాణిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలుపొందింది. బెంగళూరు జట్టుపై 5 వికెట్ల తేడాతో, చెన్నై జట్టుని 54 పరుగుల తేడాతో ఓడించింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచులో మాత్రం 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా, గుజరాత్‌ జట్టుతో పోరుకు సిద్ధమైంది. ముంబయిలోని  బ్రాబౌర్న్‌ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని