Wasim Jaffer: కోహ్లీపై ట్వీట్‌.. అదిరిపోయే జవాబిచ్చిన జాఫర్

టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ వసీమ్‌ జాఫర్‌ సామాజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో ఫన్నీ మీమ్స్‌ పోస్టు చేయడంలోనైనా...

Updated : 08 Jan 2022 10:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ వసీమ్‌ జాఫర్‌ సామాజిక మాధ్యమాల్లో ఎంత చురుగ్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తనదైన శైలిలో ఫన్నీ మీమ్స్‌ పోస్టులు చేస్తుంటాడు. ఇక ఎవరైనా ఏదైనా పోస్టులు పెడితే వాటికి తగ్గట్టుగా స్పందించడంలోనూ ఈ దేశవాళీ బ్యాటింగ్‌ దిగ్గజం అందరికన్నా ముందుంటాడు. తాజాగా ఓ ఆస్ట్రేలియన్‌ వెబ్‌సైట్‌కు సైతం జాఫర్‌ అలాంటి చురకలే అంటించి వార్తల్లో నిలిచాడు.

టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ గత రెండేళ్లుగా స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. 2019 నవంబర్‌లో కోల్‌కతా వేదికగా జరిగిన డే/నైట్‌ టెస్టులో బంగ్లాదేశ్‌పై చివరిసారి శతకం బాదాడు. ఇక అప్పటి నుంచి విరాట్‌ ఇప్పటివరకూ మరో మూడంకెల స్కోర్‌ నమోదు చేయలేదు. దీంతో అతడి బ్యాటింగ్‌ సగటు కూడా ఈ మధ్య తగ్గింది. ఈ క్రమంలోనే ‘7Cricket’ అనే ఓ ఆస్ట్రేలియన్‌ వెబ్‌సైట్‌.. తాజాగా కోహ్లీ బ్యాటింగ్‌ సగటును ఆసీస్‌ పేసర్‌ మిచెల్ స్టార్క్‌తో పోల్చింది. ‘స్టాట్‌ ఆఫ్‌ ది డే’ అని పేర్కొంటూ.. 2019 నుంచి టెస్టుల్లో స్టార్క్‌ సగటు 38.63, కోహ్లీ సగటు 37.17 ఉన్నాయని వారి ఫొటోలతో సహా ఓ ట్వీట్‌ చేసింది. దీనికి స్పందించిన జాఫర్‌ తనదైన శైలిలోనే నవ్వుతున్న ఎమోజీ జత చేసి మరింత దీటుగా జవాబిచ్చాడు. టీమ్‌ఇండియా యువ పేసర్‌ నవ్‌దీప్‌ సైని (53.50) వన్డే కెరీర్‌ బ్యాటింగ్‌ సగటు.. ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ స్టీవ్‌స్మిత్‌ (43.34) కన్నా మెరుగ్గా ఉందంటూ రీట్వీట్‌ చేశాడు. దీనికి భారత అభిమానులు తెగ నవ్వుకుంటూ లైకులు, షేర్లు చేస్తున్నారు.

కాగా, ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విరాట్‌ వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, మూడో టెస్టుకు ముందు అతడు తిరిగి నెట్స్‌లో సాధన చేయడంతో ఆ మ్యాచ్‌కల్లా ఫిట్‌నెస్ సాధిస్తాడని హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘మూడో టెస్టు వరకూ అన్ని రకాలుగా కోహ్లి సిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నా. కసరత్తులు చేసుకోవడానికి అతడికి తగినంత సమయం దొరికింది. కేప్‌టౌన్‌లో నెట్‌ సెషన్స్‌ ద్వారా అతడు తిరిగి లయ అందుకుంటాడు. అతడితో మాట్లాడాక చివరి టెస్టుకు అందుబాటులో ఉంటాడనిపిస్తోంది’ అని ద్రవిడ్‌ తాజాగా మీడియాతో అన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని