ఉఫ్‌.. మళ్లీ అదే పిచ్చా: రూట్‌..! 

అసలే స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లాండ్‌ జట్టును టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ ఓ ఆట ఆడుకున్నాడు...

Published : 04 Mar 2021 01:16 IST

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లను ఆడుకున్న జాఫర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అసలే స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై వరుసగా రెండు టెస్టులు ఓడిపోయిన ఇంగ్లాండ్‌ జట్టును టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ ఓ ఆట ఆడుకున్నాడు. తాజాగా నాలుగో టెస్టుకు ముందు పలువురు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు మొతేరా పిచ్‌ను పరిశీలిస్తున్న ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకొని.. దానికి సరదా వ్యాఖ్యలు జత చేశాడు. పిచ్‌ను పరిశీలిస్తున్న ఆటగాళ్ల మధ్య చర్చ ఎలా ఉంటుందనే విషయానికి జాఫర్‌ తనదైన శైలిలో హాస్యం జోడించాడు. అది సందర్భోచితంగా ఉండడంతో నెటిజన్లు సైతం ఆస్వాదిస్తున్నారు. జాఫర్‌ పంచుకున్న ఫొటోలో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు.. స్టువర్ట్‌ బ్రాడ్‌, మార్క్‌వుడ్‌, జానీ బెయిర్‌స్టో, ఆ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌తో పాటు కెప్టెన్‌ జోరూట్‌ ఉన్నారు. దీంతో వారి మధ్య సంభాషణ ఇలా సాగిందని రాసుకొచ్చాడు. 

స్టువర్ట్‌ బ్రాడ్‌: ఈ పిచ్‌ను చూస్తుంటే నా టూర్‌ అయిపోయిందని అనుకుంటున్నా.
మార్క్‌వుడ్‌: కనీసం నువ్వు రెండు టెస్టులైనా ఆడావు. (మార్క్‌ ఇంకా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు)
బెయిర్‌స్టో: నాకు ఫ్లాట్‌ పిచ్‌ తయారు చేయలేదా? (పింక్‌బాల్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో డకౌట్‌)
కాలింగ్‌వుడ్‌: ఈ పిచ్‌ మీద కూడా బంతి తిరుగుతుందా?
జోరూట్‌: ఉఫ్‌.. మళ్లీ అదే పిచ్‌?

అని పేర్కొంటూ జాఫర్‌ పోస్టు చేశాడు. దాంతో ఈ పోస్టు నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఇక గతవారం ఇదే పిచ్‌పై జరిగిన పింక్‌బాల్‌ టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పై పలువురు ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ మాజీ ఆటగాళ్లు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌కు ఇలాంటి పిచ్‌ను తయారు చేయడం సరికాదని, ఇది ఆటకు ఏమాత్రం మంచిది కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నాలుగో టెస్టుకు స్పిన్‌కు అనుకూలించే వికెట్‌నే సిద్ధం చేస్తారని క్రికెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాఫర్‌ పర్యాటక జట్టును ఉద్దేశిస్తూ ట్రోలింగ్‌ చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని