PAK vs AUS: అనుకోకుండా స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయిన క్రికెటర్‌.. వీడియో చూడండి

ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆలెక్స్‌ క్యారీకి వింత అనుభవం ఎదురైంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న అతడు అనుకోకుండా స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయాడు...

Published : 11 Mar 2022 13:53 IST

(Photo: Pat Cummins Instagram video screenshot)

కరాచి: ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆలెక్స్‌ క్యారీకి వింత అనుభవం ఎదురైంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ పర్యటనలో ఉన్న అతడు అనుకోకుండా స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు నెటిజన్లకు నవ్వులు పూయిస్తోంది. పాకిస్థాన్‌తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఒక టీ20 ఆడేందుకు అక్కడికి వెళ్లిన నేపథ్యంలో కరాచిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే రావల్పిండిలో తొలి టెస్టు ఆడిన అనంతరం రెండు జట్ల ఆటగాళ్లు ఇప్పుడు కరాచీకి చేరుకున్నారు. అక్కడి హోటల్‌లో బసచేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు సరదాగా స్విమ్మింగ్‌పూల్‌ వద్ద ఏదో మాట్లాడుకుంటుండగా క్యారీ చూసుకోకుండా వెళ్లి అందులో పడిపోయాడు. ఆసీస్‌ కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్‌ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అభిమానులు సరదాగా నవ్వుకుంటున్నారు.

మరోవైపు రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో మొత్తం 5 రోజుల ఆటలో కేవలం 14 వికెట్లే పతనమైన నేపథ్యంలో ఆ పిచ్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐసీసీ సైతం దానిపై స్పందించింది. ఇది అత్యంత సాధారణ పిచ్‌ అని అభివర్ణించింది. ‘ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ మధ్య తొలి టెస్టుకు ఉపయోగించిన రావల్పిండి పిచ్‌లో తొలిరోజు నుంచి చివరి రోజు వరకు పెద్దగా మార్పులు కనబడలేదు. కొద్దిపాటి బౌన్స్‌ తప్పితే అటు పేసర్లకు ఇటు స్పిన్నర్లకు ఏమాత్రం సహకరించలేదు. బంతికి, బ్యాట్‌కు మధ్య సమానమైన పోటీనే లేదు. ఈ పిచ్‌ను అత్యంత సాధారణ పిచ్‌గా రేటింగ్‌ ఇచ్చాం’ అని మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ మదుగలె పేర్కొన్నారు. రిఫరీ ఇచ్చిన నివేదికతో రావల్పిండి వేదికకు ఐసీసీ ఒక అయోగ్యత పాయింట్‌ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 476/4 స్కోరు సాధిస్తే.. ఆస్ట్రేలియా 449 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆట నిలిచిపోయే సమయానికి పాక్‌ ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 252 పరుగులు చేసింది. దీంతో ఇది డ్రాగా ముగిసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని