Gujarat: రషీద్‌ ఆఖరి బంతికి సిక్సర్‌.. గుజరాత్‌ ఆటగాళ్ల సంబరాలు చూడండి

గతరాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ ఆఖరి బంతికి ఉత్కంఠభరితమైన విజయం సాధించడంతో ఆ జట్టు ఆటగాళ్లు సంతోషంలో మునిగితేలారు...

Published : 28 Apr 2022 10:22 IST

(Photo: Rashid Khan Instagram)

ముంబయి: హైదరాబాద్‌తో గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ ఆఖరి బంతికి ఉత్కంఠభరితమైన విజయం అందుకోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు సంతోషంలో మునిగితేలారు. హైదరాబాద్‌ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు అద్భుతంగా పోరాడింది. దీంతో చివరికి ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో (14 పాయింట్లు) అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఆఖరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 22 పరుగులు అవసరమైన వేళ.. రాహుల్‌ తెవాతియా (40 నాటౌట్‌; 21 బంతుల్లో 4x4, 2x6), రషీద్‌ ఖాన్‌ (31 నాటౌట్‌; 11 బంతుల్లో 4x4) దంచికొట్టారు.

మార్కో జాన్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 20వ ఓవర్‌లో.. తెవాతియా తొలి బంతికి సిక్సర్‌ బాది రెండో బంతికి సింగిల్‌ తీశాడు. తర్వాత రషీద్‌ మూడో బంతిని సిక్సర్‌గా మలచడంతో చివరి మూడు బంతుల్లో ఆ జట్టు విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. అయితే, రషీద్‌ నాలుగో బంతిని వదిలేయడంతో ఉత్కంఠ తార స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే చివరి రెండు బంతుల్ని సిక్సర్లుగా సంధించడంతో గుజరాత్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఓడిపోతామనుకున్న మ్యాచ్‌ గెలవడంతో డగౌట్‌లోని గుజరాత్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు. అలాగే మైదానంలోని తెవాతియా, రషీద్‌ సైతం విజయోత్సాహంలో మునిగిపోయారు. ఆ వీడియోను టోర్నీ నిర్వాహకులు ట్విటర్‌లో పోస్టు చేశారు. అది మీరూ చూసి ఆనందించండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని