కోహ్లీ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ : ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌

భారత సారథి విరాట్‌ కోహ్లీ అగ్రశ్రేణి ఆటగాడని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ కితాబిచ్చాడు. ‘కోహ్లీ అగ్రశ్రేణి ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు క్రీజులో కుదురుకుంటే  ప్రత్యర్థి జట్టుకు విజయావకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే బౌలర్లు అతడిని త్వరగా ఔట్‌ చేయాలనే లక్ష్యంతో బంతులేస్తారు.

Updated : 31 Aug 2021 22:44 IST

ఇంటర్నెట్‌ డెస్కు: భారత సారథి విరాట్‌ కోహ్లీ అగ్రశ్రేణి ఆటగాడని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ కితాబిచ్చాడు. ‘కోహ్లీ అగ్రశ్రేణి ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అతడు క్రీజులో కుదురుకుంటే  ప్రత్యర్థి జట్టుకు విజయావకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే బౌలర్లు అతడిని త్వరగా ఔట్‌ చేయాలనే లక్ష్యంతో బంతులేస్తారు. మేం సిరీస్‌ గెలవాలంటే ఇలాంటివి తప్పవు. ఇప్పటికి కూడా మేము కోహ్లీపై ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా ఔట్‌ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. 2018 పర్యటనలో కోహ్లీ 593 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, ప్రస్తుత సిరీస్‌లో కోహ్లీ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ఈ సిరీస్‌లో కోహ్లీపై తీవ్ర ఒత్తిడి ఉంది. అవుట్‌ స్వింగ్‌ బంతులను అంచనా వేయడంలో విఫలమై వెనుదిరుగుతున్నాడు. బ్యాటింగ్‌ చేసేందుకు ఇదే సరైన పద్ధతి అని ఏమీ లేదు. ప్రతి ఒక్కరికీ తమదైన శైలి ఉంటుంది. పరిస్థితులను బట్టి ఎప్పుడు ఎలా ఆడాలో నిర్ణయించుకోవాలి. గత టెస్టులో మేం బాగా రాణించాం. ప్రత్యర్థికి ఎక్కువగా అవకాశాలివ్వలేదు. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించాం. లీడ్స్‌లో మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది. తర్వాతి మ్యాచులో కూడా ఇదే ఫలితాన్ని ఆశిస్తున్నాం’ అని రూట్‌ అన్నాడు. 

కోహ్లీ సేన మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో కూడా పేలవ ప్రదర్శనను కొనసాగించింది. టాప్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ క్రీజులో కుదురుకున్నట్టు అనిపించినా.. అదెంతో సేపు నిలవలేదు. ఒక దశలో 237/3 పరుగులతో మెరుగ్గానే కనిపించినా.. తర్వాతి బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా విఫలమవడంతో 41 పరుగులకే మిగతా 7 వికెట్లను కోల్పోయింది. దీంతో ఇంగ్లాంగ్‌ ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని