IND vs NZ: తుది జట్టు ఎంపికలో గందరగోళం అవసరం లేదు.. జట్టుకే మొదటి ప్రాధాన్యమిస్తాం : కోహ్లి

ముంబయిలో జరుగనున్న రెండో టెస్టుకి కెప్టెన్‌ విరాట్ కోహ్లి అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. దీంతో జట్టు నుంచి ఎవరిని తప్పించాలనే విషయంపై సందిగ్ధం నెలకొంది. ఈ విషయంపై..

Published : 02 Dec 2021 19:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయిలో జరుగనున్న రెండో టెస్టుకి కెప్టెన్‌ విరాట్ కోహ్లి అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. దీంతో జట్టు నుంచి ఎవరిని తప్పించాలనే విషయంపై సందిగ్ధం నెలకొంది. ఈ విషయంపై కోహ్లి స్పందిస్తూ.. రెండో టెస్టు కోసం తుది జట్టు ఎంపికలో గందరగోళం అవసరం లేదని అన్నాడు. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రయోజనాల కంటే.. జట్టుకే తొలి ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నాడు. జట్టు అవసరాలను బట్టి యాజమాన్యం ఆటగాళ్లను ఎంపిక చేస్తుందని చెప్పాడు.

‘సుదీర్ఘంగా సాగే టెస్టుల్లో రాణించాలంటే మంచి ఫామ్‌లో ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వెంటవెంటనే విభిన్న ఫార్మాట్లలో ఆడాల్సి రావడంతో.. టెక్నిక్‌తో పాటు మానసికంగానూ అందుకు సిద్ధంగా ఉండాలి. వీలైనంత త్వరగా పిచ్ పరిస్థితులకు అలవాటు పడాలి. క్రీజులో నిలదొక్కుకోగలిగితే.. ఆటను బాగా అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా మేం తుది జట్టు కూర్పులో చాలా సార్లు మార్పులు చేశాం. జట్టుకు కావాల్సిందేంటో ఆటగాళ్లకు వివరించాం. మా ఆలోచనతో వారు కూడా ఏకీభవించారు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ఇదేమంత కష్టం కాదు. మా ప్రయాణంలో కూడా ఒడిదొడుకులు ఉండొచ్చు. అయినా, మనమంత ఆడుతున్నది ఒకే జట్టుకి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆటగాళ్ల వ్యక్తిగత ప్రయోజనాల కంటే.. జట్టుకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం. అలాగే, గత ఐదారు సంవత్సరాలుగా జట్టు కోసం ఆడుతున్న సీనియర్ ఆటగాళ్లకు అండగా ఉంటాం. భవిష్యత్‌లో కూడా దాన్ని కొనసాగిస్తాం’ అని కోహ్లి పేర్కొన్నాడు. మెడనొప్పితో బాధపడుతున్న వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్ సాహా కోలుకున్నాడని.. రెండో టెస్టుకి అతడు అందుబాటులోకి వస్తాడని కోహ్లి స్పష్టం చేశాడు. డిసెంబర్‌ 3 నుంచి ముంబయి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

 

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని