Wrestlers: అలాగైతేనే ఏషియన్‌ గేమ్స్‌కు వెళ్తాం.. రెజ్లర్ల అల్టిమేటం

Wrestlers Protest: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయకపోతే తాము ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొనేదే లేదని అగ్రశ్రేణి రెజ్లర్లు తేల్చిచెప్పారు. గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.

Updated : 10 Jun 2023 16:13 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు, భాజపా ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా ఆందోళన (Wrestlers Protest) చేపట్టిన భారత అగ్రశ్రేణి రెజ్లర్లు శనివారం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. తమ డిమాండ్లు పరిష్కారమైతేనే ఈ ఏడాది జరగబోయే ఏషియన్‌ గేమ్స్‌ (Asian Games)లో పాల్గొంటామని, లేదంటే వాటిని బహిష్కరిస్తామని హెచ్చరించారు.

హరియాణాలోని సోనిపట్‌లో శనివారం జరిగిన ఖాప్‌ నేతలు నిర్వహించిన మహాపంచాయత్‌లో రెజ్లర్లు సాక్షి మలిక్‌ (Sakshee Malikkh), బజరంగ్‌ పునియా (Bajrang Punia) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాక్షి మలిక్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సమస్యలన్నీ పరిష్కారమైతేనే మేం ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొంటాం. మేం ప్రతిరోజూ మానసికంగా ఎంతటి వేదన అనుభవిస్తున్నామో మీకు అర్థం కాదు’’ అని అన్నారు. ఇక, ఈ సందర్భంగా బజరంగ్‌ పునియా మాట్లాడుతూ.. ప్రభుత్వంలో జరిగిన చర్చల గురించి ఖాప్‌ నేతలకు వివరించనున్నట్లు తెలిపారు. ఇక, ఆందోళన చేస్తున్న రెజ్లర్ల మధ్య ఐక్యత లోపించిందంటూ వస్తున్న వార్తలను సాక్షి మలిక్‌ తోసిపుచ్చారు. తామంతా ఒక్కటే అని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ కలిసికట్టుగా ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు.

బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఇటీవల భారత అగ్రశ్రేణి రెజర్లు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కొన్ని రోజుల పాటు దీక్ష (Wrestlers Protest) చేపట్టిన విషయం తెలిసిందే. వీరి ఆందోళన ఇటీవల ఉద్ధృతమవడంతో స్పందించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. వారితో చర్చలు జరిపారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఈ నెల 15 లోగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని, జూన్‌ 30 లోగా డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో.. రెజ్లర్లు తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. రెజ్లర్ల ఫిర్యాదుతో బ్రిజ్‌ భూషణ్‌పై దిల్లీ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వాటిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ జరుపుతోంది. ఇప్పటివరకు 180 మందిని విచారించారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఆయన ఇంటి వద్దకు ఓ మహిళా రెజ్లర్‌ను తీసుకెళ్లి సీన్‌ రీక్రియేషన్ చేయించారు. ఈ కేసులో త్వరలోనే సిట్‌ బృందం దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని