Virat Kohli: తొలిసారి కోహ్లీ గడుసరి ఆటగాడని అనుకున్నా: ఏబీ డివిలియర్స్‌

ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకూ కప్పు సాధించకపోవచ్చు కానీ, ఆ జట్టుకు ఉన్న క్రేజే వేరు. అందుకు ప్రధాన కారణం మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఒకటైతే...

Updated : 23 Feb 2024 15:48 IST

(Photo: Virat Kohli Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకూ కప్పు సాధించకపోవచ్చు కానీ, ఆ జట్టుకు ఉన్న క్రేజే వేరు. అందుకు ప్రధాన కారణం మాజీ సారథి విరాట్‌ కోహ్లీ ఒకటైతే.. మరొకటి మిస్టర్ 360 బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌. ఆధునిక క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా పేరుగాంచిన వీరిద్దరు కొన్నేళ్ల పాటు ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌కు వెన్నెముకలా నిలిచారు. అయితే, తాజాగా డివిలియర్స్‌ కోహ్లీ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. మాజీ సారథిపై తన తొలి అభిప్రాయం ఏమిటో వివరించాడు. ఇటీవల ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఏబీడీ.. కోహ్లీని తొలిసారి ‘కాస్త గడుసరి’ ఆటగాడని పేర్కొన్నాడు.

‘మేం ఇద్దరం ప్రత్యేకంగా తొలిసారి కలవడానికి ముందే పలుమార్లు బయట పలకరించుకున్నాం. దాంతో మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పరిచయం ఉంది. మొదట్లో కోహ్లీని చూసి కాస్త గడుసరి ఆటగాడని అనుకున్నా. అదే అతడి గురించి నా తొలి అభిప్రాయం. అయితే, క్రికెట్‌ బాగా ఆడుతున్నా కోహ్లీకి కొంచెం గర్వం, అతివిశ్వాసం ఉన్నట్లు కనిపించాడు. తొలిసారి మా భేటి కాసేపే జరిగింది. అయినా అప్పుడు నేను ఎలాంటి కామెంట్‌ చేయలేదు. ఆ వయసులో క్రికెటర్లు అలాగే ఉండాలని నేను భావించాను. కానీ, ఆర్సీబీకి ఎంపికయ్యాక మేం ఇద్దరం మళ్లీ కలుసుకొని మాట్లాడుకున్నాం. దాంతో మేం బాగా కలిసిపోయాం. అప్పటి నుంచే మా మధ్య అనుబంధం పెరిగింది. స్నేహంగా మారింది. నేనైతే సహజంగా ఎవరితోనూ మాట్లాడను. ఎందుకో కోహ్లీతో బాగా కనెక్ట్‌ అయ్యా. మా అనుబంధం కొనసాగింది. దీంతో అతడితో ఎల్లప్పుడూ టచ్‌లోనే ఉంటున్నా. మా ఇద్దరి మధ్య చాలా విషయాలు ఒకేలా ఉంటాయి. మేం క్రికెట్‌ ఆడే విధానం కూడా ఒకలాగే ఉంటుంది’ అని డివిలియర్స్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని