బాక్సింగ్‌ డే టెస్టు.. ఆ పేరు ఎలా వచ్చింది?

మెల్‌బోర్న్‌ వేదికగా శనివారం నుంచి భారత్×ఆస్ట్రేలియా జట్లు రెండో టెస్టు ఆడనున్నాయి. ఆ మ్యాచ్‌ను బాక్సింగ్‌ డే టెస్టుగా పిలుస్తున్నారు. అయితే.....

Updated : 23 Feb 2024 16:49 IST

ఇంటర్నెట్‌డెస్క్: మెల్‌బోర్న్‌ వేదికగా శనివారం నుంచి భారత్×ఆస్ట్రేలియా జట్లు రెండో టెస్టు ఆడనున్నాయి. ఆ మ్యాచ్‌ను బాక్సింగ్‌ డే టెస్టుగా పిలుస్తున్నారు. అయితే అసలు ఆ మ్యాచ్‌ను బాక్సింగ్‌ డే టెస్టు అని ఎందుకు అంటున్నారు? క్రికెట్, బాక్సింగ్ భిన్నమైన క్రీడలు కదా.. మరీ బాక్సింగ్‌ డే ఏంటి?అనే సందేహాలు అందరిలోనూ కలుగుతుంటాయి. అయితే మీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఇది చదవాల్సిందే.

‘క్రిస్మస్‌ బాక్స్‌’ పేరు మీదగా ‘బాక్సింగ్‌ డే’ వచ్చింది. క్రిస్మస్‌ సందర్భంగా ‘క్రిస్మస్‌ బాక్స్‌’ పేరుతో తమ సేవకులకు వారి యజమానులు డిసెంబర్‌ 26న బాక్సుల్లో బహుమతులు అందిస్తుంటారు. అందులో ఆహార పదార్థాలతో పాటు నగదు, ఇతర వస్తువులు ఇస్తుంటారు. దీంతో ఆ రోజుని బాక్సింగ్‌ డే అని పిలవడం ప్రారంభమైంది. అలా కామన్‌వెల్త్ దేశాల్లో బాక్సింగ్‌ డే పేరు అందరికీ పరిచయమైంది.

అయితే ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌ వేదికగా బాక్సింగ్‌ డే (డిసెంబర్ 26) రోజున ప్రారంభమయ్యే మ్యాచ్‌..‌ ‘బాక్సింగ్ డే టెస్టు’గా స్థిరపడింది. 1950 నుంచి మొదలైన ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. 1963 వరకు డిసెంబర్‌ 26న మ్యాచ్‌ ప్రారంభం కాలేదు. కానీ ఆ రోజు ఆటలో ఉండేలా షెడ్యూల్ చేసేవారు. 1973 నుంచి సరిగ్గా అదే రోజున ప్రారంభమయ్యేలా ప్రణాళిక రూపొందించారు. అయితే, 1976 నుంచి 1979 వరకు కొన్ని కారణాలతో టెస్టు నిర్వహించనప్పటికీ.. 1980 నుంచి మాత్రం ఏటా నిర్వహిస్తున్నారు. అలా బాక్సింగ్ డే రోజు టెస్టు ఆరంభమవ్వడంతో దానికి ఆ పేరు స్థిరపడిపోయింది.

మెల్‌బోర్న్‌ వేదికగానే ఎందుకు? 

ఆస్ట్రేలియాలోని మైదానాల్లో మెల్‌బోర్న్‌ స్టేడియమే అతి పెద్దది. లక్ష మంది ప్రేక్షకులు వీక్షించే సామర్థ్యం ఈ స్టేడియం సొంతం. దీంతో మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబర్‌ 26న జరిగే టెస్టును బాక్సింగ్‌ డే అని పిలవడం ప్రారంభమైందని చెబుతుంటారు. ఇప్పటివరకు టీమిండియా ఎనిమిది బాక్సింగ్‌ డే టెస్టులు ఆడింది. 2018లో జరిగిన గత టెస్టులో విజయం సాధించగా, అయిదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. రెండు టెస్టులు డ్రాగా ముగిశాయి.

ఇదీ చదవండి

కోహ్లీకి క్షమాపణలు చెప్పా: రహానె

టీమ్‌ఇండియా రెండో టెస్టు జట్టు ఇదే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని