Sachin Tendulkar: సచిన్‌ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్‌ మాజీ పేసర్‌..కారణమేమిటంటే?

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, పాకిస్థాన్ మాజీ పేసర్‌ షోయబ్ అక్తర్‌ మధ్య జరిగిన సరదా సన్నివేశాన్ని భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ సంఘటన మూలంగా సచిన్‌ కాళ్ల మీద పడి మరీ అక్తర్‌ క్షమాపణలు కోరినట్లు వెల్లడించాడు.

Updated : 21 Mar 2023 20:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌ (Sachin Tendulkar) కాళ్ల మీద పడి మరీ క్షమించమని అడిగాడు పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ (Shoaib Akhtar). కానీ ఇది జరిగింది ఇప్పుడు కాదు దిగ్గజ క్రికెటర్లిద్దరూ గొప్పగా రాణిస్తున్న రోజుల్లో.. ఈ విషయాన్ని స్వయంగా భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (Virender Sehwag) వెల్లడించాడు. ఇంతకీ విషయమేమిటంటే..?

సచిన్‌ తెందుల్కర్‌, షోయబ్‌ అక్తర్‌ మధ్య జరిగిన ఓ సరదా సంఘటనను వీరూ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేస్తుకున్నాడు. దాని గురించి ఎప్పుడు ప్రస్తావించినా భారత క్రికెటర్లు నవ్వకుండా ఉండలేరన్నాడు. తెందుల్కర్‌ను అక్తర్‌ తన భుజాలపై ఎత్తుకోవడానికి ప్రయత్నించి విఫలమవడంతో వారిద్దరూ కింద పడిపోయినట్లు తెలిపాడు. అతడు భారతీయుల ఆశల్ని తన భుజాలపై మోస్తున్నాడు..అందుకే అంత బరువున్నాడని సచిన్‌ను చమత్కరించినట్లు చెప్పాడు. ‘‘ఓసారీ లఖనవూలో భారత్‌, పాకిస్థాన్‌ క్రికెటర్ల మధ్య పార్టీ జరిగింది. అప్పుడు అక్తర్‌ చాలా తాగాడు. సచిన్‌ను ఎత్తుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతడు చాలా బరువు ఉండటంతో తనని ఎత్తడం అక్తర్‌ వల్ల కాలేదు. దాంతో ఇద్దరూ ఒక్కసారిగా కింద పడిపోయారు. అప్పుడు నేను నవ్వకుండా ఉండలేకపోయాను’’ అని వీరూ తెలిపాడు. 

‘‘ఈ ఘటనతో అక్తర్‌ చాలా ఇబ్బందిపడ్డాడు. తనని నేను చాలా ఆటపట్టించాను. నీ పని అయిపోయింది. ఇక నీ కెరీర్‌ ప్రశ్నార్థకమే? నువ్వు మా జట్టులో గొప్ప ఆటగాడిని కింద పడేశావు అంటూ భయపెట్టాను. నా మాటలకు అతడు చాలా భయపడ్డాడు. సచిన్‌ ఎక్కడ బీసీసీఐకి ఫిర్యాదు చేస్తాడోనని భయపడి తనకు క్షమాపణలు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇక మాస్టర్‌ బ్లాస్టర్‌ ఎక్కడ కనిపించినా తనను అనుసరిస్తూ క్షమాపణలు చెప్పేవాడు. ఓరోజు ఏకంగా తన కాళ్లమీద పడిపోయాడు. నేను సచిన్‌ ఎప్పుడు కలిసినా ఈ సంఘటనను గుర్తు చేసుకొని ఇప్పటికీ నవ్వుకుంటాం’’ అని సెహ్వాగ్‌ వివరించాడు. భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య శత్రుత్వం కేవలం మైదానం వరకే పరిమితమవుతుందని అతడు పేర్కొన్నాడు. ఇరుజట్లు బయట కలుసుకున్నప్పుడు పరస్పరం ఆతిథ్యమిచ్చుకుంటాయని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు