IPl: బట్లర్‌తో మయాంక్‌ ఢీ.. పోటీలో గబ్బర్‌

ఐపీఎల్‌లో ఆదివారం నాటి మ్యాచులు అభిమానులను అలరించాయి. జోస్‌ బట్లర్‌ వీర విధ్వంసం.. మయాంక్‌ అగర్వాల్‌ అజేయ పోరాటం.. శిఖర్‌ ధావన్‌ సమయోచిత ఇన్నింగ్స్‌ ఆకట్టుకున్నాయి.....

Published : 03 May 2021 12:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌లో ఆదివారం నాటి మ్యాచులు అభిమానులను అలరించాయి. జోస్‌ బట్లర్‌ వీర విధ్వంసం.. మయాంక్‌ అగర్వాల్‌ అజేయ పోరాటం.. శిఖర్‌ ధావన్‌ సమయోచిత ఇన్నింగ్స్‌ ఆకట్టుకున్నాయి. డేవిడ్‌ వార్నర్‌కు తుది జట్టులో చోటు లేకపోవడం, హైదరాబాద్‌ ఘోరంగా ఓడిపోవడం ఫ్రాంచైజీ అభిమానులను బాధించాయి. మరి ఎవరి ఆటతీరుకు మీరు ఎంత రేటింగ్‌ ఇస్తారు?

శిఖర్‌ ధావన్‌: దిల్లీకి ఎప్పటిలాగే శుభారంభం అందించాడు గబ్బర్‌ (69*; 47 బంతుల్లో 6×4, 2×6). ఛేదనలో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పృథ్వీషా, స్టీవ్‌స్మిత్‌, రిషభ్ పంత్‌, హెట్‌మైయిర్‌తో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. జట్టును గెలిపించేందుకు ఎవరో ఒకరు ఆఖరి వరకు ఉండాలన్న ఉద్దేశంతో సమయోచితంగా చెలరేగాడు.

మయాంక్‌: పంజాబ్‌ నాయకుడిగా మయాంక్‌ అగర్వాల్‌ (99*; 58 బంతుల్లో 8×4, 4×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ జట్టుకు శుభారంభం లభించకున్నా.. 166 పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. చూడచక్కని బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లతో అలరించాడు. అతడే గనక ఆఖర్లో చెలరేగకపోతే పంజాబ్‌ 100 పరుగులైనా చేసేది కాదేమో!

జోస్‌ బట్లర్‌: హైదరాబాద్‌ మ్యాచులో రాజస్థాన్‌ 220 పరుగులు చేసేందుకు ఏకైక కారణం జోస్‌ బట్లర్‌ (124; 64 బంతుల్లో 11×4, 8×6). సంజు శాంసన్‌తో కలిసి దాదాపు 150 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సన్‌రైజర్స్‌ బౌలర్లను చితకబాదాడు. వరుస బౌండరీలు, కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగాడు. చివర్లో అతడు ఔటయ్యాడు కానీ లేదంటే స్కోరు 240 దాటేదే. ఇక బట్లర్‌కు ఇదే తొలి శతకం కావడం గమనార్హం.

ఫిజ్‌, మోరిస్‌: రాజస్థాన్‌ పేసర్లు ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (3/20), క్రిస్‌ మోరిస్‌ (3/29) ఛేదనలో హైదరాబాద్‌ను దెబ్బకొట్టారు. వీరిద్దరూ కలిసి ఆరు వికెట్లు తీశారు. మనీశ్ పాండే, (31), విజయ్‌ శంకర్‌ (8), కేదార్‌ జాదవ్‌ (19), మహ్మద్‌ నబీ (10), అబ్దుల్‌ సమద్‌ (10), రషీద్‌ ఖాన్‌ (0)ను ఔట్‌ చేశారు. దాదాపుగా మిడిలార్డర్‌ మొత్తాన్నీ వీరిద్దరూ పెవిలియన్‌కు పంపించడమే కాకుండా ఆ జట్టును 165కు పరిమితం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని