Virat Kohli: ఆ సమయంలో ధోనీ ఒక్కడే మెసేజ్‌ చేశాడు: కోహ్లీ

టీవీల ఎదుట కూర్చోని, ప్రపంచం మొత్తానికి తెలిసేలా సలహాలు ఇస్తే అస్సలు పట్టించుకోనని టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ వ్యాఖ్యానించారు. నిన్న ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌

Updated : 05 Sep 2022 19:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీవీల ఎదుట కూర్చొని, ప్రపంచం మొత్తానికి తెలిసేలా సలహాలు ఇస్తే అస్సలు పట్టించుకోనని టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ వ్యాఖ్యానించారు. నిన్న ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అనంతరం నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో అతడు మాట్లాడాడు. ఈ సందర్భంగా తనకు ధోనితో ఉన్న అనుబంధం ఎంత బలమైందో మరోసారి వివరించాడు. విమర్శకులకు దీటుగా సమాధానమిచ్చాడు.

ధోనీతో అనుబంధం గురించి  కోహ్లీ మాట్లాడుతూ ‘‘నేను టెస్టు కెప్టెన్సీని వదిలేసినప్పుడు కేవలం ఒకే ఒక్క వ్యక్తి నుంచి నాకు మెసేజ్‌ వచ్చింది. గతంలో నేను అతడితో కలిసి ఆడాను. ఆ వ్యక్తి ఎమ్మెస్‌ ధోనీ. మరెవరూ నాకు మెసేజ్‌లు చేయలేదు. నా ఫోన్‌నంబర్‌ చాలా మంది వద్ద ఉంది. చాలా మంది నాకు టీవీల్లో సలహాలు ఇస్తున్నారు. కానీ, ధోనీ ఒక్కడే వ్యక్తిగతంగా మెసేజ్‌ చేశాడు. మీకు ఎవరితోనైనా నిజాయతీతో కూడిన సంబంధాలు ఉంటే.. మీకు ఇరువైపుల నుంచి నమ్మకముందన్న విషయం అర్థమవుతుంది. నేను అతడి నుంచి ఏమీ ఆశించలేదు.. అతడు నా నుంచి ఏమీ ఆశించలేదు. మేము ఇద్దరం పరస్పరం అభద్రతా భావంతో ఎప్పుడూ లేము’’ అని అన్నాడు. 

టీవీల్లో బహిరంగ సలహాలు ఇవ్వడంపై మాట్లాడుతూ.. ‘‘నేను ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే.. వ్యక్తిగతంగా చెబుతాను. మీరు టీవీల ఎదుట లేదంటే ప్రపంచం మొత్తానికి తెలిసేట్లు నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే..  వాటికి నా వద్ద ఎలాంటి విలువ ఉండదు. మీరు నాతో వ్యక్తిగతంగా మాట్లాడవచ్చు. వాటిని నేను నిజాయితీగా పరిశీలిస్తాను. అవి ఎలా ఉంటాయో మీరే చూస్తారు. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు.. మీరు విజయం సాధించేలా ఆ భగవంతుడే చూస్తాడు. అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి’’ అని కింగ్‌ కోహ్లీ  పేర్కొన్నాడు. 

తప్పులు ఎవరైనా చేస్తారు..

అర్ష్‌దీప్‌ సింగ్‌ కీలక సమయంలో క్యాచ్‌ను వదిలేయడంపై కోహ్లీ స్పందించాడు. ఈ విషయంలో అర్ష్‌దీప్‌ను పూర్తిగా వెనకేసుకొచ్చాడు. ‘‘ఎవరైనా తప్పులు చేస్తారు. అక్కడ పరిస్థితి చాలా ఉత్కంఠగా ఉంది. మ్యాచ్‌ చాలా ఒత్తిడిలో ఉన్నప్పుడు తప్పులు జరగొచ్చు. నేను తొలిసారి ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడుతున్నప్పుడు షాహిద్‌ అఫ్రిదీ బౌలింగ్‌లో చెత్తషాట్‌ ఆడాను. ఆ రోజు నిద్రపట్టక తెల్లవారు జాము 5 గంటల వరకూ సీలింగ్‌ చూస్తూనే గడిపాను. నా కెరీర్‌ ముగిసిపోయిందనుకొన్నాను. ఇవన్నీ సహజమే. ప్రస్తుతం టీమ్‌ ఇండియాలో మంచి వాతావరణం ఉంది. సీనియర్లు మీ చుట్టూ ఉంటారు. ఈ క్రెడిట్‌  కెప్టెన్‌, కోచ్‌కే దక్కుతుంది. తప్పును గ్రహించి.. దాని నుంచి నేర్చుకొని ముందుకు వెళ్లడమే’’ అని విరాట్‌ చెప్పారు.

హార్దిక్‌, సూర్యకుమార్‌ అద్భుతమైన ఆటగాళ్లు..

పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్‌, సూర్యకుమార్‌ పెద్దగా ప్రభావం చూపంచకపోవడంపై కోహ్లీ మాట్లాడుతూ..‘‘హార్దిక్‌, సూర్యకుమార్‌ అద్భుతమైన ఆటగాళ్లు. లీగ్‌ సిరీస్‌ నుంచి హార్దిక్‌ తన శక్తిసామర్థ్యాలను తెలుసుకొన్నాడు. నాటి నుంచి పూర్తి భిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకొన్నాడు. చాలా బాధ్యతాయుతమైన ఆటగాడు. నేను అదే గమనించాను. ఆల్‌రౌండర్‌గా అతడి బాధ్యత ఏమిటో తెలుసుకొన్నాడు. అతడు అంతగా శ్రమించడం నేను ఎన్నడూ చూడలేదు. ఈ రకంగా ఆడటం, బౌలింగ్‌ ఫిట్‌నెస్‌ సాధించడం చాలా పెద్ద విషయం. సూర్యకుమార్‌లా  ఆడే ఆటగాడు ప్రపంచంలో మరొకరు ఉంటారని అనుకోను. ఒక్కసారి అతడు ఆడటం మొదలుపెడితే.. ప్రత్యర్థుల నుంచి మ్యాచ్‌ను అలవోకగా లాగేసుకొంటాడు’’ అని పొగడ్తలతో ముంచెత్తాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని