Gill: నా తొలి వన్డేలో 9 రన్స్‌ చేశా.. అప్పుడు ధోనీ చెప్పిన మాటలు ధైర్యాన్నిచ్చాయి: గిల్

జట్టులో నిలకడగా రాణిస్తున్న యువ క్రికెటర్లలో శుభ్‌మన్‌ గిల్‌ ఒకడు. మూడేళ్ల కిందట వన్డేల్లోకి.. 2020లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన గిల్‌ ఇంకా టీ20ల్లోకి మాత్రం అడుగు పెట్టలేకపోయాడు. తాజాగా కివీస్‌తో సిరీస్‌లోనైనా అరంగేట్రం చేస్తాడని భావించినా రెండో టీ20 ఆడిన భారత జట్టులో స్థానం కల్పించలేదు.

Published : 21 Nov 2022 02:39 IST

ఇంటర్నెట్ డెస్క్: మూడేళ్ల కిందట న్యూజిలాండ్‌పైనే శుభ్‌మన్‌ గిల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. వన్డే అరంగేట్రం చేసిన గిల్‌  నిలకడగా రాణిస్తూ తుది జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. తాజాగా భారత్‌ మూడు టీ20ల కోసం న్యూజిలాండ్‌ పర్యటనలోనే ఉంది. ఆదివారం రెండో టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌తోనైనా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లోకి అడుగు పెడదామని గిల్‌ భావించాడు. కానీ అతడికి చోటు లభించలేదు. ఇక మంగళవారం చివరి మ్యాచ్‌ జరగనుంది. అందులోనైనా అవకాశం దక్కుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో శుభ్‌మన్‌గిల్ తన వన్డే అరంగేట్రం గురించి గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నాడు. 

న్యూజిలాండ్‌తో 2019లో వన్డే సిరీస్‌ సందర్భంగా అక్కడికి వెళ్లిన భారత్‌కు ఘోర ఓటమి ఎదురైంది. గిల్‌ ఆడిన మొదటి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 92 పరుగులకే కుప్పకూలింది. అందులో గిల్ 9 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన తనను అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఓదారుస్తూ చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయని గిల్ పేర్కొన్నాడు. ‘‘ఆ రోజు చాలా నిరుత్సాహానికి గురయ్యా. నా వయస్సు 19 ఏళ్లు మాత్రమే. అరంగేట్ర మ్యాచే ఇలా అయిందని బాధపడుతున్నా. అప్పుడు కెప్టెన్ ధోనీ భాయ్ నా దగ్గరకు వచ్చాడు. ‘బాధపడకు. నా కంటే నీ అరంగేట్రమే నయం’ అని అన్నాడు. ఎందుకంటే బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో ధోనీ కేవలం ఒక్క బంతినే ఎదుర్కొని రనౌట్‌ రూపంలో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఎంతో సరదాగా మాట్లాడాడు. దీంతో  నా మూడ్‌ కొంచెం మారింది. గొప్ప స్థాయిలో ఉన్న ఆటగాడు ఇలా అండగా నిలుస్తాడని ఎవరూ ఆశించరు. అది నాకెంతో నచ్చింది. నేను కూడా అతడిలా ఉండాలని అనుకున్నా’’ అని గిల్ గుర్తు చేసుకున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని