జడేజా సిక్సర్ల వర్షం.. పృథ్వీ బౌండరీల మోత 

ఐపీఎల్‌ 14 సీజన్‌లో మ్యాచ్‌లు రోజురోజుకూ రసవత్తరంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌ల ఫలితం చివరి బంతి వరకూ తేలడం లేదు. అయితే, కొంతమంది బ్యాట్స్‌మెన్‌ బౌలర్లపై ఇసుమంతైనా కనికరం చూపడం లేదు.

Published : 02 May 2021 09:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 14 సీజన్‌లో మ్యాచ్‌లు రోజురోజుకూ రసవత్తరంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌ల ఫలితం చివరి బంతి వరకూ తేలడం లేదు. అయితే, కొంతమంది బ్యాట్స్‌మెన్‌ బౌలర్లపై ఇసుమంతైనా కనికరం చూపడం లేదు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండరీలకు పంపుతూ పరుగుల వరద పారిస్తున్నారు. కొందరు ఆటగాళ్లు ఒకే ఓవర్‌లో ఏకంగా 30కిపైగా పరుగులు రాబడుతున్నారు. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఒక ఓవర్‌లో అత్యధికంగా ఎన్ని పరుగులు చేశాడో ఓ లుక్కేద్దాం.


జడేజా సిక్సర్ల వర్షం

ఏప్రిల్ 25న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో  రవీంద్ర జడేజా ఒకే ఓవర్‌లో 36 పరుగులు చేసి క్రిస్‌గేల్‌ రికార్డును సమం చేశాడు. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో జడ్డూ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సిక్స్‌లు బాదాడు. మరో ఫోర్‌ ఫోర్‌ కూడా కొట్టి రెండు పరుగులు చేశాడు. కాగా..ఇందులో మూడో బంతి నో బాల్. ఈ ఓవర్‌లో మొత్తం 37 పరుగులు వచ్చాయి. 


కమిన్స్‌ మెరుపులు

ఏప్రిల్ 21న కోల్‌కతా నైట్‌రైడర్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్‌ ఒకే ఓవర్‌లో 30 పరుగులు చేశాడు. సామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో తొలి బంతికి రెండు పరుగులు చేసిన కమిన్స్‌..తర్వాత వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. ఐదో బంతికి ఫోర్‌ కొట్టి..చివరి బంతిని స్టాండ్స్‌కు పంపాడు. దీంతో ఈ ఓవర్‌లో  కమిన్స్‌ 30 పరుగులు రాబట్టాడు.


పృథ్వీ ‘షో’

ఏప్రిల్ 29న దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన పోరులో దిల్లీ ఓపెనర్‌ పృథ్వీ షా బౌండరీల మోత మోగించి ఒకే ఓవర్‌లో 24 పరుగులు రాబట్టాడు. శివమ్‌ మావి వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్లో షా ఏకంగా 6 బంతుల్లో ఆరు బౌండరీలు బాది రికార్డు సృష్టించాడు. 


డివిలియర్స్‌ అదుర్స్‌

ఏప్రిల్ 27న రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో మిస్టర్‌ 360 ఏబీ డివిలియర్స్‌ ఒకే ఓవర్‌లో 22 పరుగులు రాబట్టాడు. స్టోయినిస్ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో తొలి బంతికి రెండు పరుగులు చేసిన ఏబీ..రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. తర్వాత నాలుగు, ఐదు బంతులను కూడా స్టాండ్స్‌కు పంపి చివరి బంతికి రెండు పరుగులు చేశాడు.


రసెల్‌ జిగేల్‌

ఏప్రిల్‌ 21న చెన్నై సూపర్‌ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో రసెల్‌ 22 పరుగులు సాధించాడు. శార్దూల్‌ ఠాకూర్  వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో తొలి బంతికి సిక్స్‌ కొట్టిన రసెల్‌..రెండో బంతికి ఫోర్‌ బాదాడు. మూడో బంతిని సిక్సర్‌గా మలిచిన విండీస్‌ వీరుడు..చివరి బంతిని కూడా స్టాండ్స్‌కు పంపాడు. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని