IPL Final: ‘బాగా బౌలింగ్‌ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్‌

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో మంచి రిథమ్‌తో బౌలింగ్‌ చేస్తున్న మోహిత్‌ శర్మను కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) డిస్టర్బ్ చేయడాన్ని భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ తప్పుబట్టాడు. 

Published : 01 Jun 2023 01:04 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌-16 సీజన్‌ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ (GT) విజయ తీరాల వరకు వచ్చి బోల్తాపడింది. చివరి ఓవర్‌లో చెన్నై (CSK) గెలుపునకు 13 పరుగులు అవసరం కాగా.. మొదటి నాలుగు బంతుల్లో బౌలర్‌ మోహిత్‌ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. దీంతో అంతా గుజరాత్ విజయం ఖాయమనుకున్నారు. అప్పటి వరకు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన మోహిత్‌ శర్మ చివరి రెండు బంతుల్లో పట్టుతప్పాడు. వచ్చిన అవకాశాన్ని జడేజా సద్వినియోగం చేసుకుని వరుసగా 6, 4 బాది జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) వెళ్లి డిస్టర్బ్‌ చేయడంతోనే బౌలర్‌ లయ తప్పాడని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అభిప్రాయపడ్డాడు. బౌలర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నప్పుడు హార్దిక్‌ మధ్యలో జోక్యం చేసుకోవడం అవసరమా? అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

‘‘యార్కర్లు వేస్తూ బ్యాటర్లను కట్టడి చేస్తున్నప్పుడు బౌలర్‌తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? బ్యాటర్‌కు 2 బంతుల్లో 10 పరుగులు అవసరమని, అతడికి యార్కర్లు సంధించి అడ్డుకట్ట వేయాలని బౌలర్‌కు తెలుసు.  అలాంటప్పుడు మీరు అతని (బౌలర్) సమయాన్ని ఎందుకు వృథా చేస్తారు? ఒక వేళ మోహిత్‌ శర్మ ఎక్కువ పరుగులు ఇచ్చుకుంటే అతడితో మాట్లాడితే ఇబ్బంది లేదు. కానీ, అతడు చక్కగా బౌలింగ్‌ చేస్తున్నప్పుడు ఓవర్‌ త్వరగా పూర్తికోవాలని కోరుకోవాలి. చివరి రెండు బంతుల్లో బౌలర్ ఫీల్డింగ్‌లో ఏమైనా మార్పులు చేయాలనుకుంటున్నాడా అనే ఆందోళన కెప్టెన్‌ (హార్దిక్‌)కు వచ్చి ఉండవచ్చు. కానీ, నేను ఆ స్థానంలో ఉంటే.. బౌలర్‌ని డిస్టర్బ్ చేయకపోయేవాడిని’’ అని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మంచి రిథమ్‌తో బౌలింగ్‌ చేస్తున్న మోహిత్‌ శర్మను హార్దిక్‌ పాండ్య డిస్టర్బ్ చేయడాన్ని భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్ కూడా తప్పుబట్టాడు. ఫైనల్‌లో గుజరాత్‌పై సీఎస్కే చివరి బంతికి విజయం సాధించి ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని