హామీ లేకుంటే.. టీ20 ప్రపంచకప్‌ వేదిక తరలించండి: పాక్‌

భారత్‌ రాతపూర్వక హామీ ఇవ్వకుంటే టీ20 ప్రపంచకప్‌ వేదికను యూఏఈకి మార్చాలని ఒత్తిడి చేస్తామని పాక్‌ క్రికెట్ ‌బోర్డు ఛైర్మన్‌ ఎహ్‌సన్‌ మణి అన్నారు. జట్టుకు మాత్రమే కాకుండా అభిమానులు, విలేకరులకు వీసాల మంజూరుపై హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ అభిప్రాయాలను ఇప్పటికే ఐసీసీకి...

Published : 21 Feb 2021 01:23 IST

కరాచీ: భారత్‌ రాతపూర్వక హామీ ఇవ్వకుంటే టీ20 ప్రపంచకప్‌ వేదికను యూఏఈకి మార్చాలని ఒత్తిడి చేస్తామని పాక్‌ క్రికెట్ ‌బోర్డు ఛైర్మన్‌ ఎహ్‌సన్‌ మణి అన్నారు. జట్టుకు మాత్రమే కాకుండా అభిమానులు, విలేకరులకు వీసాల మంజూరుపై హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ అభిప్రాయాలను ఇప్పటికే ఐసీసీకి తెలియజేశామని వివరించారు. ‘బిగ్‌ త్రి’ వైఖరి మారాల్సి ఉందన్నారు.

‘జాతీయ జట్టుకు వీసాలపై మాత్రమే రాతపూర్వక హామీ అడగడం లేదు. అభిమానులు, అధికారులు, విలేకరులకూ ఇవ్వాలని కోరుతున్నాం. మార్చి చివరికల్లా భారత్‌ మాకు హామీ ఇవ్వాలని ఐసీసీకి చెప్పాం. లేదంటే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ నుంచి యూఏఈకి మార్చాలని డిమాండ్‌ చేశాం’ అని మణి తెలిపారు. అక్టోబర్‌-నవంబర్లో భారత్‌ వేదికగా ప్రపంచకప్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ బృందం మొత్తానికి భద్రతా ఏర్పాట్లపై బీసీసీఐని హామీ అడిగామని మణి పేర్కొన్నారు. తమ రెండు దేశాల మధ్య క్రికెట్‌ జరగడం లేదు కాబట్టి భారత్‌ లేకుండానే క్రికెట్‌ నిర్వహించేందుకు పీసీబీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు.

మార్చి చివరికల్లా తమ క్రికెటర్లకు కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని మణి ధీమా వ్యక్తం చేశారు. పాక్‌కు తిరిగి క్రికెట్‌ తీసుకురావడానికి ఎంతో కృషి చేశామని అన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా నిరాకరించడం నిరాశపరిచిందని పేర్కొన్నారు. కొవిడ్‌-19 విపరీతంగా ఉన్న దశలో ఇంగ్లాండ్‌లో పర్యటించేందుకు పాక్‌ జట్టును పంపించామని గుర్తు చేశారు. ఆసియా కప్‌ నిర్వహించేందుకు శ్రీలంక బోర్డు విండో సృష్టించిందని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని