MS Dhoni: ఐపీఎల్‌లో ఇక అసలైన ధోనీని చూస్తారు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశలో ఎంఎస్‌ ధోనీ విజృంభించి ఆడతాడని చెన్నై సూపర్‌కింగ్స్‌ పేసర్‌ దీపక్‌ చాహర్‌ అన్నాడు...

Published : 27 May 2021 10:47 IST

ధీమా వ్యక్తం చేసిన దీపక్‌ చాహర్‌

ముంబయి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశలో ఎంఎస్‌ ధోనీ విజృంభించి ఆడతాడని చెన్నై సూపర్‌కింగ్స్‌ పేసర్‌ దీపక్‌ చాహర్‌ అన్నాడు. 2018, 2019 సీజన్లలోనూ అతడు ఆలస్యంగా జోరు అందుకున్నాడని తెలిపాడు. పోటీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక నేరుగా వచ్చి ఆడటం ఎవరికైనా కష్టమేనని వివరించాడు. సీఎస్‌కే ప్రధాన బౌలర్‌గా మహీ తనపై విశ్వాసం ఉంచడం సంతోషకరమని వెల్లడించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌ తీరు మారింది. ఆఖర్లో సిక్సర్ల వర్షం కురిపించే అతడు ఒత్తిడికి లోనవుతున్నాడు. ఎక్కువ పరుగులు చేయడం లేదు. యూఏఈలో జరిగిన గత సీజన్లో విఫలమైన మహీ ఈ సీజన్‌ తొలిదశలో 37 పరుగులే చేశాడు. కరోనా వైరస్‌ కేసులతో 2021 సీజన్‌ సగం పూర్తయ్యాక ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.

‘ఏ బ్యాట్స్‌మనైనా 15-20 ఏళ్లుగా ఒకేలా బ్యాటింగ్‌ చేయలేరు. వీడ్కోలు పలికాక ఏ ఆటగాడైనా అత్యున్నత పోటీఉండే ఐపీఎల్‌కు వచ్చి బ్యాటింగ్ చేయడం కష్టం. మంచి ప్రదర్శనలు చేయడానికి సమయం పడుతుంది. అతనెప్పుడూ ఫినిషర్‌ పాత్ర పోషించేవాడు. క్రమం తప్పకుండా క్రికెట్‌ ఆడకపోతే అది మరింత కష్టమవుతుంది. 2018, 19 సీజన్లలోనూ ధోనీభాయ్‌ ఆలస్యంగా జోరందుకున్నాడు. టోర్నీ సాగేకొద్దీ మెరుగయ్యాడు. ఈ సీజన్‌ రెండో అర్ధభాగంలోనూ మహీ అత్యుత్తమంగా ఆడతాడు’ అని చాహర్‌ ధీమా వ్యక్తం చేశాడు.

‘చెన్నై సూపర్‌కింగ్స్‌లో నాకిది నాలుగో సీజన్‌. ప్రధాన బౌలర్‌గా ధోనీ భాయ్‌ నాపై విశ్వాసం ఉంచాడు. ఈ నమ్మకం నాకెంతో ముఖ్యం. ఎందుకంటే అతడు నా ఒక్కడికే  కాదు ఎంతో మందికి ప్రేరణగా నిలిచాడు. ప్రత్యేక సందర్భాల్లో ఆటగాళ్లను సమర్థంగా ఉపయోగించుకోవడమే ధోనీ సారథ్యంలోని గొప్పతనం. సీఎస్‌కే తరఫున చాలా మ్యాచుల్లో పవర్‌ప్లేలో నేను మూడు ఓవర్లు విసిరాను. అతడి నుంచే నేనిది నేర్చుకున్నాను’ అని చాహర్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని