Virender Sehwag: అప్పుడు వాళ్లను వీర బాదుడు బాదుతాను అన్నాను.. కానీ : సెహ్వాగ్‌

తొలి ఐపీఎల్‌(IPL) నాటి సంగతులను వీరేంద్ర సెహ్వాగ్‌(Virender Sehwag) గుర్తుచేసుకున్నాడు. అప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో వివరించాడు.

Updated : 02 Apr 2023 15:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రపంచంలో ఎక్కడా లేని క్రేజ్‌ మన ఐపీఎల్‌(IPL)కే ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌ ప్లేయర్లు ఇందులో ఆడేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ప్రతీ సీజన్‌కు ఎంతో ఆదరణను పెంచుకుంటూ వస్తోన్న ఈ టోర్నీ.. టీమ్‌ఇండియా(TeamIndia)లోనే కాకుండా ప్రపంచ క్రికెట్‌లోనూ ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. అయితే.. ఈ టోర్నీ ప్రారంభమైనప్పుడు ఇంత ఆదరణ వస్తుందని ఎవరూ ఊహించలేదు. తొలి ఐపీఎల్‌ ఆడిన సమయంలో తన అనుభవాలను మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌(Virender Sehwag) తాజాగా ఓ క్రీడా ఛానల్‌తో పంచుకున్నాడు.

‘‘ఐపీఎల్‌కు ముందు మేమంతా టీమ్‌ఇండియా కోసం ఆడేవాళ్లం. అయితే ఈ టోర్నీ ప్రారంభమయ్యాక.. ఆటగాళ్లు విడిపోయి ఆయా జట్లకు ఆడేవారు. నా జట్టులో కొంత మంది ఆడితే.. మరికొంతమంది వేరే జట్లకు ఆడేవారు. ముఖ్యంగా చెప్పాలంటే.. జహీర్‌ ఖాన్‌, ఆశిష్‌ నెహ్రా, హర్భజన్‌ నాకు క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ‘నెట్స్‌లో ఎంతో ప్రాక్టీస్‌ చేశావు కదా.. ఐపీఎల్‌లో మ్యాచ్‌కు రా.. నిన్ను వీర బాదుడు బాదుతా’ అని నేను వారితో సరదాగా అనే వాడిని’’ అని సెహ్వాగ్‌ చెప్పాడు.

అయితే ఐపీఎల్‌లో అలాంటిదేమి జరగలేదని సెహ్వాగ్‌ వివరించాడు. ‘జహీర్‌ ఖాన్‌ నన్ను ఔట్‌ చేశాడు. నెహ్రా, హర్భజన్‌ కూడా నా వికెట్‌ తీశారు. అయితే.. నేను వారిపై మంచి ఇన్నింగ్సే ఆడాను. ఐపీఎల్‌ వచ్చాక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. సొంత జట్టు సభ్యులపైనే ఆడాల్సి వచ్చింది’ అని తెలిపాడు.

ఇక ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ.. దిల్లీలో దిల్లీ జట్టుకు మద్దతిచ్చే బదులు.. అభిమానులు సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ, ధోనీల కోసం కేకలు వేసేవారని అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నాడు ఈ మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌.

ప్రస్తుతం ఐపీఎల్‌ 16వ సీజన్‌ జరుగుతోంది. కరోనా పరిస్థితుల తర్వాత.. తొలిసారి ప్రేక్షకుల మధ్య హోం గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. గతేడాది ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ తొలి మ్యాచ్‌లోనే సీఎస్‌కేను మట్టికరిపించి బోణీ కొట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని