Virender Sehwag: బర్త్‌డే బాయ్‌.. వీరేంద్ర సెహ్వాగ్‌ సరదా ట్వీట్లు

నేడు 43వ పుట్టిన రోజు జరుపుకుంటున్న వీరేంద్ర సెహ్వాగ్‌

Updated : 26 Dec 2021 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాటింగ్‌లో దూకుడుకు మారు పేరు వీరేంద్ర సెహ్వాగ్‌. అది టెస్టా, వన్డేనా అనే తేడా లేకుండా బాదడమే ‘వీరు’డి లక్ష్యం. 2007 టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌ను భారత్‌ గెలుచుకోవడంలో ఈ డ్యాషింగ్‌ బ్యాటర్‌ కీలక పాత్ర పోషించాడు. మొత్తం 374 అంతర్జాతీయ మ్యాచుల్లో 17వేలకుపైగా పరుగులు చేశాడు. అలాంటి మన వీరేంద్రుడి 43వ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 20). 1978లో సరిగ్గా ఇదే రోజున దిల్లీలో సెహ్వాగ్‌ జన్మించాడు. క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన సెహ్వాగ్‌.. రిటైర్‌మెంట్ తర్వాత సామాజిక మాధ్యమాల్లో విజృంభిస్తున్నాడు. తనదైన శైలిలో ఛలోక్తులు విసరుతూ సమాధానాలు ఇవ్వడం వీరూ స్టైల్‌. ఇటీవల కాలంలో  వీరూ చేసిన పలు పోస్టులు మీ కోసం..

వినోదం కలిగించే పొరపాట్లు 

* ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ ఎంత పెద్ద హిట్టో మనందరికి తెలుసు. ఐపీఎల్‌లో ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌, బౌలింగ్‌ మిస్టేకులను చాలా సరదాగా వీడియో రూపంలో వీరూ చేసిన పోస్టు భలేగా ఆకట్టుకుంది.


సీఎస్‌కేకు నాలుగో ఐపీఎల్‌ టైటిల్‌

ఐపీఎల్‌లో సీఎస్‌కే తిరుగులేని జట్టు. 14వ సీజన్‌ టైటిల్‌ను సీఎస్‌కే సొంతం చేసుకుంది. ఇది ఆ జట్టుకు నాలుగో టైటిల్‌ కావడం విశేషం. ఫైనల్‌ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు రవీంద్ర జడేజా నాలుగు అంకెను చూపిస్తూ చేసిన సంజ్ఞను సెహ్వాగ్ పోస్ట్‌ చేశాడు. 


భలేగా లింక్‌ పెట్టాడే..

ఐపీఎల్‌లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ నాయకత్వం వహించిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ సందర్భంగా జరిగిన ఓ సన్నివేశాన్ని.. ఇంగ్లాండ్‌, కివీస్‌ జట్ల మధ్య వరల్డ్‌ కప్ ఫైనల్‌కు లింక్‌ పెట్టాడు. కేకేఆర్‌ ఫీల్డర్‌ రాహుల్‌ త్రిపాఠి త్రో చేసిన బంతి డీసీ బ్యాటర్ రిషభ్‌ పంత్‌కు తాకింది. అయితే అటువైపు అశ్విన్‌ రన్‌ కోసం పిలుపు ఇవ్వడంతో పంత్‌ పరుగు కోసం వెళ్లాడు.   బ్యాటర్లు క్రీడాస్ఫూర్తితో పరుగు తీయరేమోనని మోర్గాన్‌ భావించాడు. ఈ సందర్భాన్ని 2019 వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో బెక్‌స్టోక్స్ పరుగుతో లింక్‌ పెట్టి పోస్ట్‌ చేయడం విశేషం. 


పెన్సిల్‌తో రాసుకోవాలట..

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఈ ఏడాది వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే నాలుగు టెస్టులు ముగిశాక.. కోచ్‌ రవిశాస్త్రి, ఇతర సిబ్బందికి కరోనా రావడంతో ఐదో టెస్టు మ్యాచ్‌ వాయిదా పడింది. టెస్టు మ్యాచ్‌ను తర్వాత నిర్వహిస్తామని బీసీసీఐ పేర్కొంది. ఈ క్రమంలో సెహ్వాగ్‌ విసిరిన చమత్కార పోస్టు నవ్వులు పూయించింది. ఐదోటెస్టు అని రాసి దాని పక్కన గీత గీచాడు. అయితే అక్కడ పెన్సిల్‌తో పూరించాలని ట్విటర్‌లో పోస్టు పెట్టాడు. 


గురువు నేర్పిన పాఠం

లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో లోయర్ ఆర్డర్‌లో వచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌ (60) సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. శార్దూల్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేసిన సెహ్వాగ్‌..  గిఫ్ట్‌ ఇచ్చాడని పేర్కొన్నాడు. శార్దూల్‌ను చూసి మిగతా బ్యాటర్లు నేర్చుకోవాలనే ఉద్దేశాన్ని అందులో చెప్పకనేచెప్పాడు.


కృష్ణాష్టమి కవిత..

కృష్ణాష్టమి సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్‌ అద్భుతమైన కవితను ట్విటర్‌లో పోస్టు చేశాడు. హిందీలో చేసిన ఆ పోస్టుకు భారీ సంఖ్యలో లైకులు, షేర్లు వచ్చాయి.


భాషాభేదాలు లేవని నిరూపించాడుగా..

ఆటకు ప్రాంతం, మతం, కులం అనే భేదాలు ఉండవు. అలానే వాటన్నింటికీ అతీతంగా ఉంటానని సెహ్వాగ్‌ చెబుతుంటాడు. ఏ ప్రాంతంవారికైనా తమ భాషలోనే శుభాకాంక్షలు చెప్పడం సెహ్వాగ్‌ ప్రత్యేకత. ఓనం సందర్భంగా మళయాళంలో ట్వీట్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 


టెస్టులకు ఇదొక సూపర్‌ ఏడాది

సెహ్వాగ్‌కు టెస్టు క్రికెట్‌ అంటే ఎనలేని మక్కువ. ఈ ఏడాది టీమిండియా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ దేశాలకు టెస్టులను ఆడేందుకు వెళ్లింది. దానిని ఉదహరిస్తూ చేసిన ట్వీట్‌ ఆకట్టుకుంది.


బుమ్రా, షమీని వదల్లేదు

కవితకు అనర్హం ఏదీ లేదంటాడు కవి. సెహ్వాగ్‌కు కూడా ట్వీట్‌ చేయడానికి ప్రతిదీ కథావస్తువే. ఇంగ్లాండ్‌పై అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన బుమ్రా, షమీలనూ వదల్లేదు. తనదైన శైలిలో వారిపై మీమ్స్‌తో ఫన్నీగా ఆడేసుకున్నాడు. 


కొవిడ్‌ మార్గదర్శకాలతో బాల్‌ టాంపిరింగ్‌!

భారత్‌, ఇంగ్లాండ్‌  జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌ను ఎవరూ అంత తేలిగ్గా మరిచిపోలేరు. ఆ సందర్భంగా ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు బంతిని తొక్కుతున్న ఫొటోను సెహ్వాగ్‌ షేర్‌ చేశాడు. కొవిడ్‌ నిబంధనలతో ఇంగ్లాండ్‌ బాల్‌ టాంపిరింగ్‌కు పాల్పడిందని సరదాగా ట్వీట్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు