అనుకున్నామా.. అమ్మాయిల కోసం ఏడుస్తామని!
ఎప్పుడైనా కలగమన్నామా..! మహిళల క్రికెట్ మ్యాచ్కు లక్షమంది హాజరవుతారని. ఎప్పుడైనా ఊహించామా..! మహిళల క్రికెట్ను కోట్లాది మంది అనుసరిస్తారని. ఎప్పుడైనా అనుకున్నామా..! మహిళల క్రికెట్ ఫైనల్ కోసం పురుషులు టీవీలకు అతుక్కుపోతారని. ఎప్పుడైనా అనుకున్నామా..! అమ్మాయిలు ఓటమిపాలైతే భావోద్వేగంతో అభిమానులూ కన్నీరు కారుస్తారని. ఇవన్నీ నిజం చేసింది 2020....
భావోద్వేగంతో కట్టిపడేసిన హర్మన్సేన
ఎప్పుడైనా కలగమన్నామా..! మహిళల క్రికెట్ మ్యాచ్కు లక్షమంది హాజరవుతారని. ఎప్పుడైనా ఊహించామా..! మహిళల క్రికెట్ను కోట్లాది మంది అనుసరిస్తారని. ఎప్పుడైనా అనుకున్నామా..! మహిళల క్రికెట్ ఫైనల్ కోసం పురుషులు టీవీలకు అతుక్కుపోతారని. ఎప్పుడైనా అనుకున్నామా..! అమ్మాయిలు ఓటమిపాలైతే భావోద్వేగంతో అభిమానులూ కన్నీరు కారుస్తారని. ఇవన్నీ నిజం చేసింది 2020.
ఎంత మారిందో..
మహిళల క్రికెట్ అంటేనే ఒకప్పుడు ఎవరికీ తెలిసేది కాదు. ఆ మ్యాచులు జరుగుతున్నా పట్టించుకొనే నాథుడే లేడు. ఒక విదేశీ జట్టు వచ్చిందంటే స్పాన్సర్ కోసం నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి. అప్పుడప్పుడు అంజుమ్ చోప్రా పేరు వినపడేది. ఆ తర్వాత మిథాలీరాజ్ కనపడటం మొదలైంది. ఎప్పుడైతే మహిళల క్రికెట్ బీసీసీఐలో విలీనమైందో వారి దశ తిరిగింది. కష్టాలు మెల్లిమెల్లిగా తొలగిపోయాయి. విదేశీ పర్యటనలు పెరిగాయి. పత్రికలు, మీడియాలో వివరాలు వచ్చాయి. ఆపై ప్రత్యక్ష ప్రసారాలు మొదలయ్యాయి. ఇప్పుడు వేద కృష్ణమూర్తి, జులన్ గోస్వామి, హర్మన్ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తిశర్మ, జెమీమా రోడ్రిగ్స్, పూనమ్ యాదవ్, షెఫాలీ వర్మ, రాజేశ్వరీ గైక్వాడ్, అరుంధతీ రెడ్డి వంటి క్రికెటర్లు అందరికీ పరిచయం అయ్యారు. 2020, మార్చి 8న భారత మహిళల జట్టు కోసం అభిమానులు భావోద్వేగానికి గురవ్వడమే కాకుండా కన్నీరు కార్చారు. ఎన్నెన్నో అనుభూతులను పంచిన ఆ ప్రపంచకప్ గురించి మరొక్కసారి నెమరేసుకుందాం.
ఫైనల్ దాకా జైత్రయాత్ర
ఆస్ట్రేలియా వేదికగా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఈ టీ20 ప్రపంచకప్ జరిగింది. పది జట్లు రెండు బృందాలుగా తలపడ్డాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కఠిన ప్రత్యర్థులున్న గ్రూప్-ఏలో భారత జట్టుకు చోటు లభించింది. దాంతో టీమ్ఇండియా సెమీస్కు చేరడం కష్టమే అనుకున్నారు. అలాంటిది మిగిలిన నాలుగు జట్లను చిత్తుచేసి 8 పాయింట్లు, +0.979 రన్రేట్తో సంచలనం సృష్టించింది హర్మన్ సేన. తొలి మ్యాచులోనే ఆతిథ్య ఆస్ట్రేలియాకు మర్చిపోలేని షాకిచ్చింది. 132 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకొని 17 పరుగుల తేడాతో విజయబావుటా ఎగరేసింది. రెండో మ్యాచులో బంగ్లాను 18 పరుగుల తేడాతో మట్టికరిపించింది. మూడో మ్యాచులో న్యూజిలాండ్కు 3 పరుగుల తేడాతో ఓటమి రుచి చూపించి సెమీస్కు అర్హత సాధించింది. ఆఖరి లీగు మ్యాచులో శ్రీలంకను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. వర్షం కారణంగా ఇంగ్లాండ్తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో నేరుగా ఫైనల్కు చేరుకుంది.
ఫైనల్లో కన్నీరు
అనుకున్న రోజు రానేవచ్చింది. ఒకవైపు ఓటమెరుగని భారత్. మరోవైపు మిథాలీసేన చేతిలో తొలి మ్యాచులో దెబ్బతిన్న ఆస్ట్రేలియా. ఫైనల్లో ఫేవరెట్ ఎవరో చెప్పలేని పరిస్థితి. ఆసీస్ వైపు అనుభవం ఉంటే టీమ్ఇండియా వైపు ఆశలున్నాయి. ఇక చరిత్రాత్మక మెల్బోర్న్ దాదాపుగా లక్షమందితో నిండిపోయింది. వంద కోట్లమంది భారతీయులు టీవీ తెరలకు అతుక్కుపోయారు. సచిన్, గంగూలీ, గావస్కర్, లక్ష్మణ్, సెహ్వాగ్, గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు భారత జట్టు గెలవాలని శుభాకాంక్షలు తెలిపారు. టాస్ అదృష్టం ఆతిథ్య జట్టునే వరించింది. అయితే ఆ జట్టు ఓపెనర్లు అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7×4, 5×6), బెత్మూనీ (78*; 54 బంతుల్లో 10×4) చుక్కలు చూపించారు. మొదటి మ్యాచులో భయపడ్డ పూనమ్ బౌలింగ్ను అత్యంత తెలివిగా ఎదుర్కొన్నారు. స్వీప్ షాట్లతో రాణించి తొలి వికెట్కు 115 పరుగులు చేశారు. టీమ్ఇండియాకు 185 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు. ఛేదనలో షెఫాలీ (2), స్మృతి (11) పేలవ ఆరంభం ఇచ్చారు. దీప్తి శర్మ (33) మినహా మరెవ్వరూ పరుగులు చేయకపోవడంతో భారత్ 99కే ఆలౌటై 85 పరుగులతో చిత్తై రన్నరప్తో సరిపెట్టుకుంది. పెద్ద మ్యాచులు ఆడకపోవడం, అనుభవలోపం, సీనియర్ల నిలకడ లేమి, ఒత్తిడికి చిత్తవ్వడం టీమ్ఇండియా ఓటమికి కారణాలయ్యాయి.
అదరగొట్టిన షెఫాలీ
సీనియర్లు, స్టార్లు విఫలమైన ఈ ప్రపంచకప్లో కొందరు అమ్మాయిలు అదరగొట్టారు. ఓపెనర్ షెఫాలీ వర్మ 5 మ్యాచుల్లో 32.60 సగటు, 158.25 స్ట్రైక్రేట్తో 163 పరుగులు చేసింది. టాప్-5లో నిలిచింది. 18 బౌండరీలు, 9 సిక్సర్లూ బాదింది. అత్యధిక సిక్సర్లు బాదిన అమ్మాయిగా హీలీతో సమానంగా నిలిచింది. టోర్నీలో అత్యధిక స్ట్రైక్ సైతం ఆమెదే. బౌలర్ మీదుగా ఆమె కొట్టిన సిక్సర్లకు విశ్లేషకులు ఫిదా అయ్యారు. మరో విషయం ఏంటంటే అప్పటికి ఆమె ప్రపంచ నంబర్వన్ బ్యాట్స్వుమన్. ఇక ఆల్రౌండర్ దీప్తిశర్మ చేసిన 116 పరుగులు ఎంతో విలువైనవి. టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన ప్రతిసారీ నేనున్నా అంటూ సమయోచిత భాగస్వామ్యాలు నెలకొల్పింది. ఇక స్పిన్నర్ పూనమ్ యాదవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 5 మ్యాచుల్లో 11.90 సగటుతో ఆమె 10 వికెట్లు తీసి టాప్-2లో నిలిచింది. ఆసీస్తో తొలి మ్యాచులో నాలుగు వికెట్ల ఘనతనూ అందుకుంది. తనదైన ఫ్లయిటెడ్ డెలివరీలు, వేగంలో మార్పు చేస్తూ ఆమె టోర్నీ సాంతం రాణించింది. 7 వికెట్లతో పేసర్ శిఖాపాండే సైతం ఫర్వాలేదనిపించింది. స్మృతి మంధాన, హర్మన్ప్రీత్, వేద కృష్ణమూర్తి రాణించకపోవడం ఫైనల్లో జట్టు కొంప ముంచింది.
విమెన్ ఐపీఎల్ కావాలి
ఏదేమైనప్పటికీ ఈ ప్రపంచకప్ అభిమానులు, క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోతుంది. ఎందుకంటే సీనియర్లెవరూ రాణించకపోయినా, తక్కువ లక్ష్యాల్ని బౌలర్లు కాపాడారు. కొత్తగా వచ్చిన అమ్మాయిలు సత్తా చాటడం ఆనందం కలిగించింది. ఇంగ్లాండ్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో స్వల్ప తేడాతో ఫైనల్ ఓడిపోవడం.. ఇక్కడ టీ20 ఫైనల్లో ఓటమి బాట పట్టడంతో వారిపై సానుభూతి, ప్రేమ కలిగింది. వారికి మరింత ప్రోత్సాహం అవసరం అనిపించింది. ఆసీస్, కివీస్, విండీస్ బౌలర్లను ఎదుర్కోవాలంటే టీమ్ఇండియా అమ్మాయిలకు ఫిట్నెస్, భుజబలం అవసరం. స్మృతి, హర్మన్, షెఫాలీ భారీ సిక్సర్లు కొట్టగలిగినా దీప్తిశర్మ లాంటి ఆల్రౌండర్కు ఇది మరింత అవసరం. పురుషులకు మాదిరిగానే వీరికి ఎక్కువ ద్వైపాక్షిక సిరీసులు ఏర్పాటు చేయాలి. పెద్ద మ్యాచుల్లో ఒత్తిడికి చిత్తవ్వకుండా ఉండాలంటే ఐపీఎల్ తరహా వేదిక కావాలి. ఆసీస్, ఇంగ్లాండ్ వంటి జట్లు ప్రపంచకప్లు గెలుస్తున్నాయంటే మహిళల బిగ్బాష్ లీగులో పాల్గొనడమే కారణం. ఈ ఏడాది కరోనా ఉన్నా టీ20 ఛాలెంజర్స్ నిర్వహించిన బీసీసీఐ వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక ఐపీఎల్ నిర్వహిస్తుందని ఆశిద్దాం.
ఇవీ చదవండి..
కరోనా వేట.. 2020లో ఆట
రోహిత్కు అతడే సరైన జోడీ: గావస్కర్
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.