WTC Final: పుంజుకున్న టీమ్‌ఇండియా బౌలర్లు.. ఆస్ట్రేలియా 469 ఆలౌట్

 భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final)లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైంది.

Updated : 08 Jun 2023 18:59 IST

లండన్‌:  భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ (WTC Final)లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌ నైట్‌ స్కోరు 327/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. భారత్ బౌలర్లు పుంజుకోవడంతో మరో 142 పరుగులు జోడించి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్ (163; 174 బంతుల్లో 25 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు సెంచరీ చేయగా.. స్టీవ్‌ స్మిత్ (121; 268 బంతుల్లో 19 ఫోర్లు) నిలకడగా ఆడి శతకం సాధించాడు. అలెక్స్‌ కేరీ (48; 69 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్ వార్నర్ (43; 60 బంతుల్లో 8 ఫోర్లు) క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో సిరాజ్‌ 4, శార్దూల్  ఠాకూర్‌ 2, షమి 2, జడేజా ఒక వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.

ట్రావిస్‌ హెడ్‌ (146), స్మిత్‌ (95) స్కోర్లతో రెండో ఆటను కొనసాగించారు. మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే సిరాజ్‌ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు స్మిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం షమి బౌలింగ్‌లో ట్రావిస్‌ హెడ్‌ ఫోర్‌ కొట్టి 150 మార్క్‌ దాటాడు. భారీ స్కోరు దిశగా సాగుతున్న హెడ్‌ను సిరాజ్‌ ఔట్ చేశాడు. హెడ్ వికెట్ కీపర్‌ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్ (6) షమి బౌలింగ్‌లో స్లిప్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. స్మిత్ శార్దూల్ ఠాకూర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ (5)ను సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ అక్షర్ పటేల్ అద్భుతమైన త్రోతో రనౌట్ చేశాడు. ఈ క్రమంలో భోజన విరామ సమయానికి ఆసీస్‌ 422/7తో నిలిచింది. లంచ్‌ బ్రేక్ తర్వాత కేరీ దూకుడు పెంచాడు. షమి బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. జడేజా వేసిన 115 ఓవర్‌లో మూడో బంతికి సిక్స్ బాదిన కేరీ.. తర్వాతి బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలుత అంపైర్‌ నాటౌట్ ఇవ్వగా.. భారత్ డీఆర్‌ఎస్‌కు వెళ్లి ఫలితం రాబట్టింది. సిరాజ్‌ బౌలింగ్‌లో నాథన్‌ లైయన్ (9) క్లీన్‌బౌల్డ్ అవ్వగా..  కమిన్స్‌ (9) రహానెకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో ఆసీస్‌ ఆలౌటైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు