AUS vs IND WTC Final: భారత్‌కు వీరు.. ఆసీస్‌కు వారు.. ఎవరిదయ్యేనో పైచేయి?

మరో మూడు రోజుల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈసారి విజేతగా నిలిచి గదను ఎవరు సొంతం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Published : 04 Jun 2023 13:30 IST

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండోసారి టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు (WTC Final) చేరింది. తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసారైనా భారత్‌ విజేతగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ప్రత్యర్థి ఆస్ట్రేలియాను (AUS vs IND) తక్కువగా అంచనా వేయకూడదు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పాటు దూకుడుగా ఆడే బ్యాటర్లు.. పేస్‌ ఎటాక్‌తో కూడిన బౌలర్లు ఆ జట్టు సొంతం. మరి ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు ఎవరనేది ఓసారి పరిశీలిద్దాం.. 

భారత్ టాప్‌ ఆర్డర్‌ ఇదీ..

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పుజారా, శుభ్‌మన్‌ గిల్.. వీరితో కూడిన టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు. కెప్టెన్‌ రోహిత్ శర్మ ఫామ్‌తో సంబంధం లేని ఆటగాడు. తనదైన రోజున చెలరేగిపోతాడు. ఇక శుభ్‌మన్‌ గిల్ ఐపీఎల్‌లో అదరగొట్టేసి ఫామ్‌తో ఇంగ్లాండ్‌కు చేరాడు. అయితే, ఆసీస్‌ ఆటగాళ్లను కలవరపెట్టేది మాత్రం ఛెతేశ్వర్‌ పుజారా, విరాట్ కోహ్లీ మాత్రమే అనడంలో సందేహం లేదు. పుజారా కౌంటీల్లో ఆడిన అనుభవం అక్కరకొస్తుంది. వీరిద్దరికి ఆసీస్‌పై ఉన్న రికార్డే దానికి కారణం. అలాగే డబ్ల్యూటీసీ సైకిల్లో (2021-23) భారత్‌ తరపున బ్యాటింగ్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన తొలి ఇద్దరు ఆటగాళ్లు పుజారా (887 పరుగులు), కోహ్లి (869)నే. ఏ ఒక్కరు క్రీజ్‌లో పాతుకుపోయినా.. భారత్‌కు భారీ స్కోరు రావడం ఖాయం. చాన్నాళ్ల తర్వాత టీమ్ఇండియాలోకి అడుగు పెట్టిన అజింక్య రహానె ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. కీపర్‌ విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. ఇషాన్‌, కేఎస్ భరత్‌లో ఎవరిని తీసుకోవాలనేది మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారే అంశమే. 

ఆసీస్‌లో ఆ జోడిని విడదీస్తేనే..

టెస్టు ఫార్మాట్‌లో ఆసీస్‌ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ గత కొంతకాలంగా ఫామ్‌లేక ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్‌లో దూకుడుగా ఆడకపోయినా.. తన ఫామ్‌ తిరిగివచ్చేలా ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడి ఓపెనింగ్‌ పార్టనర్‌ ఉస్మాన్ ఖవాజా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌ ఉండనే ఉన్నారు. పేస్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌ ఈసారి తమకు కీలక ఆటగాడిగా మారతాడని ఆసీస్ శిబిరం భావిస్తోంది. ఆస్ట్రేలియా టాప్‌ ఆర్డర్‌ను త్వరగా ఔట్‌ చేయగలిగితే మ్యాచ్‌పై భారత్‌ పట్టు సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. 

బౌలింగ్‌లో ఆసీస్‌కు తక్కువేం కాదు.. 

ఇంగ్లాండ్‌ పిచ్‌లు అంటేనే ఫాస్ట్‌ బౌలింగ్‌కు స్వర్గధామంగా ఉంటాయి. ఓవల్‌ పిచ్‌ పరిస్థితి కూడా అదే. కానీ, మ్యాచ్‌ జరిగే కొద్దీ స్పిన్‌కూ సహకరిస్తుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. భారత్‌ ముగ్గురు స్పిన్నర్లతో ఇంగ్లాండ్‌లో అడుగు పెట్టింది. అయితే, తుది జట్టులో మాత్రం అవకాశం ఒకరికా...? ఇద్దరికా..? అనేది తెలియాల్సి ఉంది. పేస్‌ బౌలింగ్‌లో బుమ్రా లేకపోయినా బలంగానే ఉంది. షమీ, సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయ్‌దేవ్ ఉనద్కత్‌తోపాటు ఆల్‌రౌండర్ శార్దూల్‌ ఠాకూర్‌ ఉన్నాడు.  ముగ్గురికే అవకాశం ఉండొచ్చు. షమీ, సిరాజ్‌తోపాటు మూడో పేసర్‌గా ఆల్‌రౌండర్ ఠాకూర్‌ వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యపడక్కర్లేదు. నాలుగో పేసర్‌ అయితే, జయదేవ్‌ను తీసుకోవాలి. లెఫ్ట్‌ఆర్మ్‌ పేసర్ ఉండటం బెటర్. 

కెప్టెనే పేసర్..

ఆసీస్‌ కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్‌ పేసర్‌. ఓవల్‌ మైదానం పరిస్థితి ఆసీస్‌ పిచ్‌లకు కాస్త దగ్గరగానే ఉంటుంది. అతడితోపాటు హేజిల్‌వుడ్, మిచెల్‌ స్టార్క్‌ పేస్ భారం మోస్తారు. ఒకవేళ హేజిల్‌వుడ్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోతే.. స్కాట్ బొలాండ్‌కు అవకాశం ఇవ్వడం  తథ్యం. పేస్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్ గ్రీన్‌ ఉండటం ఆసీస్‌కు అదనపు బలం. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ గణాంకాలు కలిగిన నాథన్‌ లైయన్‌ తుది జట్టులో ఉంటాడు. రెండో స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశాలు చాలా తక్కువ. మరీ ముఖ్యమనుకుంటే లబుషేన్‌ బౌలింగ్‌ వేయగలడు. 

తుది జట్లు (అంచనా)

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్‌ కోహ్లీ, ఇషాన్‌ కిషన్ (వికెట్ కీపర్), అజింక్య రహానె, జడేజా, అశ్విన్‌, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్‌

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్‌ స్మిత్, మార్నస్‌ లబుషేన్, ట్రావిస్‌ హెడ్‌, కామెరూన్ గ్రీన్, అలెక్స్‌ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్ /స్కాట్ బొలాండ్, మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని