WTC Finals: భారత్‌ ఎక్కడో ఉన్నా తప్పలేదు!

చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో గెలుపొందేందుకు టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ జట్లు సర్వశక్తులూ ఒడ్డుతాయని, ఇలాంటి గొప్పపోరులో భాగమైనందుకు అవి సంతోషంగా ఉంటాయని మాజీ ఆల్‌రౌండర్‌ అజిత్‌ అగార్కర్‌ పేర్కొన్నాడు.

Published : 06 Jun 2021 01:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో గెలుపొందేందుకు టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ జట్లు సర్వశక్తులూ ఒడ్డుతాయని, ఇలాంటి గొప్పపోరులో భాగమైనందుకు అవి సంతోషంగా ఉంటాయని మాజీ ఆల్‌రౌండర్‌ అజిత్‌ అగార్కర్‌ పేర్కొన్నాడు. తాజాగా అతడు ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అనేది గొప్ప విశేషమని, అందులో ఏ ఆటగాడైనా తనదైన ముద్రవేస్తే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారని చెప్పాడు. అలాంటివే ఈ మ్యాచ్‌ను మరింత ప్రత్యేకంగా మారుస్తాయని అగార్కర్‌ అభిప్రాయపడ్డాడు.

‘ఈ మ్యాచ్‌లో ప్రత్యేక మైలురాయి చేరుకున్న తొలి ఆటగాడినే ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకుంటారు. అదే ఈ ఫైనల్‌ను ప్రత్యేకంగా నిలుపుతుంది. ఇందులో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌ పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా ఒకానొక స్థితిలో 360 పాయింట్లతో అన్ని జట్లకన్నా చాలా ముందంజలో ఉండేది. అయితే, విజయాల శాతం ప్రకారం ర్యాంకుల నియమాలు మార్చినప్పుడు.. కోహ్లీసేన సైతం చివరికి ఫైనల్స్‌లో చోటుకోసం కష్టపడాల్సి వచ్చింది’ అని అగార్కర్‌ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ఇరు జట్లూ ఫైనల్‌లో పోటీపడేందుకు సిద్ధంగా ఉండటమే కాకుండా ఎంతో ఉత్సాహంగా ఉంటాయన్నాడు.

అనంతరం భారత్‌ ఆడించే పేస్‌ బౌలర్లపై స్పందించిన అగార్కర్‌.. తుది జట్టులో బుమ్రా, షమి, ఇషాంత్‌ శర్మ ఉంటారని అంచనా వేశాడు. ఒకవేళ మ్యాచ్‌ ప్రారంభమయ్యే నాటికి మైదానం పచ్చికతో నిండి ఉంటే నాలుగో పేసర్‌ను కూడా తీసుకునే వీలుందన్నాడు. అప్పటికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదని, ముఖ్యంగా అక్కడి పిచ్‌లపై డ్యూక్‌బాల్స్‌ సీమర్లకే అనుకూలిస్తాయన్నాడు. అన్ని జట్లలాగే టీమ్‌ఇండియాలోనూ సమర్థవంతమైన పేసర్లున్నారని గుర్తుచేశాడు. గతకొన్నేళ్లుగా కోహ్లీసేన బలం వీళ్లేనని తెలిపాడు. షమి టెస్టుల్లో టీమ్‌ఇండియా తరఫున నంబర్‌ వన్‌ బౌలర్‌ అని, ఇషాంత్‌ గత కొన్నేళ్లుగా బాగా రాణిస్తున్నాడని అగార్కర్‌ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని