మెంటార్‌గా యువీ!

యువీ.. ఆరు సిక్సర్లతో అదరగొట్టాడు. హ్యాట్రిక్‌ వికెట్లు తీసి మురిపించాడు. టీమ్‌ఇండియాకు ప్రపంచకప్‌లు అందించాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులకు ఆపద్బాంధవుడు అయ్యాడు. ఇప్పుడు మెంటార్‌ అవతారం ఎత్తాడు. అయితే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఏదో ఒక జట్టుకు కాదు....

Published : 04 Sep 2020 13:51 IST

లాక్‌డౌన్‌లో కుర్రాళ్లకు శిక్షణ

యువీ.. ఆరు సిక్సర్లతో అదరగొట్టాడు. హ్యాట్రిక్‌ వికెట్లు తీసి మురిపించాడు. టీమ్‌ఇండియాకు ప్రపంచకప్‌లు అందించాడు. క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులకు ఆపద్బాంధవుడు అయ్యాడు. ఇప్పుడు మెంటార్‌ అవతారం ఎత్తాడు. అయితే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఏదో ఒక జట్టుకు కాదు. ఈ సీజన్‌లో రాణించాలనుకునే పంజాబ్‌ యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తున్నాడు యువరాజ్‌.

అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు పలికిన తర్వాత యువరాజ్‌ సింగ్‌ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. తన స్వచ్ఛంద సంస్థ పనులు చూసుకుంటున్నాడు. సరదా కోసం విదేశీ పొట్టి క్రికెట్‌ లీగులు ఆడుతున్నాడు. అంతేకాకుండా అప్పుడప్పుడు యువ క్రికెటర్లను తీర్చిదిద్దే పని పెట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రిత పంజాబ్‌ క్రికెట్‌ సంఘం ఏర్పాటు చేసిన శిబిరంలో ఆటగాళ్లకు సలహాలు ఇచ్చాడు. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి? మ్యాచ్‌ పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవాలి? ఏయే సందర్భాల్లో ఎలా ఆడాలి? బ్యాటింగ్‌ టెక్నిక్‌లో చేసుకోవాల్సిన మార్పులు? మానసికంగా దృఢంగా ఉండటం ఎలా? అనే అంశాలను యువ క్రికెటర్లకు బోధించాడు.

ఇప్పుడేమో ఐపీఎల్‌లో ఆడుతున్న పంజాబ్‌ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో పీసీఏ జిమ్‌ అందుబాటులో లేకపోవడంతో శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, ప్రభుసిమ్రన్‌ సింగ్‌, అన్మోల్‌ ప్రీత్‌సింగ్‌ కసరత్తులు చేసేందుకు తన సొంత జిమ్‌ను అప్పగించాడు. త్వరగా దేహదారుఢ్యం సాధించేదుకు సలహాలు ఇచ్చాడు. అంతేకాకుండా వారికి క్రికెట్‌ పాఠాలు చెప్పాడు. మానసిక దృఢత్వం గురించి బోధించాడు. చక్కని ఆహారాన్ని అందిస్తూ సొంత తమ్ముళ్లుగా ఆదరించాడు. అందుకే సీజన్‌ పూర్తయ్యే వరకు యువీతో టచ్‌లో ఉంటామని, అవసరమైన సలహాలు అడుగుతామని ఆ కుర్రాళ్లు అంటున్నారు. సెప్టెంబర్‌19 నుంచి నవంబర్‌ 10 వరకు ఐపీఎల్‌ 2020 జరుగుతున్న సంగతి తెలిసిందే.

-ఇంటర్‌నెట్‌ డెస్క్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు