యువరాజ్‌కు బాహుబలి స్వాగతం..!

ఇండియా లెజెండ్స్‌ సూపర్‌స్టార్‌ యువరాజ్‌సింగ్‌కు బాహుబలిలాంటి ఘన స్వాగతం లభించింది. గతరాత్రి శ్రీలంకతో జరిగిన రోడ్‌సేఫ్టీ సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సచిన్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం...

Updated : 22 Mar 2021 08:57 IST

(Photo: Yuvraj Singh Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండియా లెజెండ్స్‌ సూపర్‌స్టార్‌ యువరాజ్‌సింగ్‌కు బాహుబలిలాంటి ఘన స్వాగతం లభించింది. గతరాత్రి శ్రీలంకతో జరిగిన రోడ్‌సేఫ్టీ సిరీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సచిన్ జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యువీ (60; 41 బంతుల్లో 4x4, 4x6), యూసుఫ్‌ పఠాన్‌ (62 నాటౌట్‌; 36 బంతుల్లో 4x4, 5x6) చేలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ క్రమంలోనే హోటల్‌ సిబ్బంది యువీకి వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికింది. అతడు హోటల్‌లోకి ప్రవేశిస్తుండగా సిబ్బంది రెండు వైపులా నిల్చొని వంట సామగ్రి అయిన గరిటెలను పైకెత్తి స్వాగతం పలుకుతున్నట్లు పోజిచ్చారు. దానికి హిందీ బాహుబలి పాటను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా సెట్‌చేశారు. దాంతో యువీ సైతం ఆనందంతో స్టెప్పులేసుకుంటూ లోపలికి వెళ్లాడు. ఈ వీడియోను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకొని ‘బ్రోకెన్‌ బాహుబలి’ అని పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేశాడు. దీనికి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇక ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సెహ్వాగ్‌(10), బద్రీనాథ్‌(7) విఫలమైనా సచిన్‌(30; 23 బంతుల్లో 5x4), యువరాజ్‌(60), యూసుఫ్‌(62*) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా యువీ, యూసుఫ్‌ సిక్సుల మోత మోగించారు. ఆపై లంక బ్యాటింగ్‌లో సనత్‌ జయసూర్య(43; 35 బంతుల్లో 5x4, 1x6), జయసింగె(40; 30 బంతుల్లో 1x4, 2x6), వీరరత్నె(38; 15 బంతుల్లో 3x4, 3x6) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరికి ఆ జట్టు 167/7 స్కోర్‌తో సరిపెట్టుకుంది. భారత బౌలర్లలో యూసుఫ్‌ పఠాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. గోనీ, మునాఫ్‌ పటేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని