Yuvraj Singh: ఆరోజు సచిన్‌ను 200 కొట్టనివ్వాల్సింది: యువరాజ్

2004లో పాకిస్థాన్‌తో జరిగిన ముల్తాన్‌ టెస్టులో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను ద్విశతకం కొట్టనివ్వాల్సిందని మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 08 May 2022 02:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2004లో పాకిస్థాన్‌తో జరిగిన ముల్తాన్‌ టెస్టులో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను ద్విశతకం కొట్టనివ్వాల్సిందని మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మాజీ ఆల్‌రౌండర్‌.. నాటి టెస్టులో జరిగిన ఆసక్తికర విషయంపై తొలిసారి స్పందించాడు. అప్పుడు జట్టు తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నాడు. 3 టెస్టుల సిరీస్‌ కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన భారత్‌ 2-1 తేడాతో గెలుపొంది తొలిసారి దాయాది గడ్డపై టెస్టు సిరీస్‌ నెగ్గింది. ముఖ్యంగా ముల్తాన్‌లో జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 675/5 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ (309; 375 బంతుల్లో 39x4, 6x6) త్రిశతకం సాధించి భారత టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. అదే సమయంలో సచిన్‌ తెందూల్కర్‌ (194 నాటౌట్‌; 348 బంతుల్లో 21x4) ద్విశతకానికి చేరువైన వేళ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడం కూడా తెలిసిందే. అయితే, ఈ విషయం అప్పట్లోనే సంచలనంగా మారింది. తెందూల్కర్‌ డబుల్‌ సెంచరీ సాధించకుండా ద్రవిడ్‌ అలా ఎందుకు నిర్ణయం తీసుకున్నాడని క్రికెట్‌ పండితులే ఆశ్చర్యపోయారు. ఇదే విషయంపై యువరాజ్‌ తాజాగా నోరు విప్పాడు. అప్పుడు సచిన్‌ను ద్విశతకం చేయనివ్వాల్సిందని అన్నాడు.

‘ఆరోజు నేనూ, సచిన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేస్తున్నామని, వేగంగా పరుగులు చేయాలని జట్టు నుంచి సందేశం వచ్చింది. అప్పుడు సచిన్‌ ఇంకో ఓవర్‌ ఆడి ఉంటే ఆ 6 పరుగులూ పూర్తి చేసి ద్విశతకం సాధించేవాడు. మేం ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేశాక 8-10 ఓవర్ల పాటు బౌలింగ్‌ చేశాం. కానీ, సచిన్‌ 194 పరుగుల వద్ద ఉండగా ఇంకో రెండు ఓవర్లు ఆడి ఉంటే అది మ్యాచ్‌పై పెద్ద ప్రభావం చూపేది కాదని నేననుకుంటా. అయితే, ఆ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నేను మాత్రం సచిన్‌ 200 కొట్టాక ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసుంటే బాగుండేదని అనుకున్నాను’ అని యువరాజ్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఆ మ్యాచ్‌లో తర్వాత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 407, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్‌ ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని