IND vs ZIM : కాచుకో టీమ్‌ఇండియా.. సవాల్‌కి సిద్ధంగా ఉండండి!

దాదాపు ఆరేళ్ల తర్వాత జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడేందుకు టీమ్‌ఇండియా మరో నాలుగు రోజుల్లో సిరీస్‌ కోసం పోటీపడనుంది. కేఎల్‌ రాహుల్ నాయకత్వంలోని...

Updated : 02 Nov 2022 10:56 IST

గట్టిగా పోరాడుతామన్న జింబాబ్వే కోచ్ డేవ్ హౌటన్

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు ఆరేళ్ల తర్వాత జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడేందుకు టీమ్‌ఇండియా హరారేకి బయల్దేరి వెళ్లింది. కేఎల్‌ రాహుల్ నాయకత్వంలోని భారత్‌ ఆగస్ట్‌ 18న తొలి వన్డేలో జింబాబ్వేతో తలపడనుంది. ఆగస్టు 20, ఆగస్టు 22న మ్యాచ్‌లను ఆడనుంది. తాజాగా బంగ్లాదేశ్‌ వంటి జట్టును ఓడించిన జింబాబ్వే.. భారత్‌కు సవాల్ విసిరడం గమనార్హం. తమ జట్టుతో టీమ్‌ఇండియా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు జింబాబ్వే ప్రధాన కోచ్‌ డేవ్ హౌటన్. 

‘‘గత కొన్నేళ్లుగా భారత క్రికెట్‌ను చూస్తూనే ఉన్నాం. ప్రపంచ క్రికెట్‌లో టాప్‌ జట్లలో ఒకటి. అంతేకాకుండా మూడు నాలుగు జట్లను తయారు చేయగలిగే సామర్థ్యం కలిగిన దేశం.  మాతో పోటీలకు వచ్చినా.. మేం మాత్రం గట్టి పోటీనిస్తాం. అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం సంపాదించడానికి వినియోగించుకుంటాం. ఇదే విషయాన్ని మా జట్టు సభ్యులకు చెప్పా. భారత్‌ వంటి పెద్ద జట్టు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మంచి స్కోర్లు సాధించడంతోపాటు అద్భుత ఫలితాలను రాబట్టాలని వివరించా. అలాగే ఏదో మ్యాచ్‌ల సంఖ్యను పెంచుకోవడానికే కాకుండా టీమ్‌ఇండియాను సవాల్‌ చేసేలా గేమ్‌ ఆడాలని సూచించా. మా ఆటగాళ్లు గట్టిగా పోరాడతారనే నమ్మకం నాకైతే ఉంది. టీమ్‌ఇండియాపై సీరియస్‌గా పోటీ పడతామని చెప్పగలను. కాబట్టి పర్యాటక జట్టు మా టీమ్‌తో జాగ్రత్తగా ఉండాలి’’ అని డేవ్ హౌటన్ వివరించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌, మూడువన్డేల సిరీస్‌ను జింబాబ్వే కైవసం చేసుకుంది. కెప్టెన్‌ రెగిస్ చకబ్వా, సికందర్‌ రజా బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించారు. 

(ఫొటో సోర్స్‌: బీసీసీఐ ట్విటర్)

వన్డే సిరీస్‌ భారత్‌తోపాటు జింబాబ్వేకు చాలా కీలకం. 2023 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించాలంటే వరల్డ్ కప్‌ సూపర్‌ లీగ్‌లో రాణించాలి. 13 జట్లు పోటీ పడుతున్న ఈ లీగ్‌లో టాప్‌-8 టీమ్‌లు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు బెర్తులను క్వాలిఫయర్స్‌ మ్యాచుల్లో నెగ్గిన జట్లకు కేటాయిస్తుంది. ప్రస్తుతం (జులై 15వరకు అప్‌డేట్) భారత్‌ ఏడో స్థానంలో ఉండగా.. జింబాబ్వే 12వ స్థానంలో ఉంది. భారత్‌ ఇప్పటికే ఆతిథ్య హోదాలో క్వాలిఫై అయిపోయింది. కాబట్టి జింబాబ్వే ప్రపంచకప్‌ రేసులో నిలవాలంటే గెలిచితీరాలి. సూపర్‌ లీగ్‌లో గెలిచిన జట్టుకు పది పాయింట్లు వస్తాయి. ఓడితే మాత్రం సున్నాతో సరిపెట్టుకోవాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని